కర్రసాము చేస్తూ కింద పడ్డ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అత్యుత్సాహంతో కొందరు ఎమ్మెల్యేలు పరువు పోగొట్టుకుంటున్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హై కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో జరిగిన సంబరాల్లో పాల్గొని హడావిడి చేయబోయారు. వైసిపి నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి జారి కింద పడ్డారు.
ప్రస్తుతం ఆయన పడిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైయస్ అవినాష్ రెడ్డికి హై కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో కడప జిల్లా ప్రొద్దుటూరులో కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సత్యమేవ జయతే, ఎప్పటికైనా న్యాయం, ధర్మమే గెలుస్తుంది అంటూ ఉన్న ప్లకార్డులను ప్రదర్శిస్తూ వైసీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ లో సందడి చేసిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కర్రసాము చేయడానికి ప్రయత్నించారు.

కర్ర సాము చేస్తుండగా కర్ర కాలికి తగిలి ఆయన కింద పడిపోయారు. దీంతో అక్కడే ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడ ఉన్న ఆయన అభిమానులు, కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం మళ్లీ ర్యాలీలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ వీడియో చూసిన వారు కర్ర సాము చెయ్యటం రానప్పుడు ఎందుకు అంతగా హంగామా చెయ్యటం అని నవ్వుకుంటున్నారు. ఎమ్మెల్యేగా హుందాగా ప్రవర్తించక కర్రసాములు చెయ్యటం అవసరమా అని చర్చించుకుంటున్నారు. ఇక ప్రత్యర్ధి పార్టీల నేతలైతే రాచమల్లు కర్రసాముకు, వైఎస్ అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తే చేస్తున్న సంబరాలకు అవాక్కవుతున్నారు.












Click it and Unblock the Notifications