నేనంటే అందరికీ ఇష్టం, తప్పు చేయలేదు: ప్రొ. లక్ష్మి, ఐజీ వివరాలు
అమరావతి: తాను ఎలాంటి తప్పు చేయలేదని వైద్యావిద్యార్థిని డాక్టర్ సంధ్యారాణి బలవన్మరణానికి కారణమైన ప్రొఫెసర్ లక్ష్మి అన్నారు. తనపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు లేవని చెప్పారు. మంగళవారం ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయసారథిని పోలీసులు మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. వీరిద్దరిని సోమవారం బెంగళూరులో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా లక్ష్మి మీడియాతో మాట్లాడారు. తాను ఏం తప్పు చేయలేదని, తాను చెప్పింది సంధ్యారాణి అర్థం చేసుకోలేకపోయిందని అన్నారు. కాగా, దురదృష్ట ఘటన జరిగింది, తప్పు ఒప్పుకుంటున్నామని ఆమె భర్త విజయసారథి చెప్పడం గమనార్హం. బెయిల్ వస్తుందనే ఆశతోనే అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు.
23 ప్రాంతాలకు వెళ్లారు
సంధ్యారాణి ఆత్మహత్య అనంతరం ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త విజయసారథి తెలుగు రాష్ట్రాలతోపాటు 23 ప్రాంతాలకు వెళ్లినట్లు ఐజీ సంజయ్ తెలిపారు. పాండిచ్చేరి, తిరుపతి, చెన్నై, షిర్డీ, సోలాపూర్, హైదరాబాద్, కర్నూలు, మంత్రాలయం, మైసూరు, బెంగళూరు, అనంతపురం, తదితర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు చెప్పారు. దీనిపై మరింత విచారణ జరగుతోందని అన్నారు.
ప్రొఫెసర్ లక్ష్మి తన నేరాన్ని అంగీకరించారని చెప్పారు. కాగా, ముద్దాయిలను దాచేందుకు ప్రయత్నించిన మరో ఆరుగురిపైనా కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. బెంగళూరులో కొటక్ మహేంద్ర బ్యాంకు ఉద్యోగి ప్రవీణ్ ముద్దాయిలకు సహకరించారని చెప్పారు. లాడ్జి వద్ద కార్డ్ స్వైప్ చేయడంతో ఆమెను పట్టుకున్నామని తెలిపారు.
పరారైన తర్వాత ప్రొఫెసర్ లక్ష్మి తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేశారని చెప్పారు. ఆమె ఫోన్ కాల్స్ చేసిన కాయిన్ బాక్స్ నుంచి డేటా సేకరిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు సహకరించిన మహారాష్ట్ర, పాండిచ్చేరి పోలీసులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
సంధ్యారాణి డైరీ వివరాలతోపాటు తమ వద్ద ఎలక్ట్రానిక్ ఆధారాలు కూడా ఉన్నాయని ఈ సందర్భంగా ఐజీ సంజయ్ తెలిపారు. ప్రొఫెసర్ లక్ష్మిని ఏపీ పోలీసులే పట్టుకున్నారని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పోలీసుల సమన్వయం వల్లే నిందితులను పట్టుకోగలిగామని తెలిపారు. అరెస్ట్ ఆపరేషన్లో పాల్గొన్న పలువురు పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.