టీటీడీ పాలక మండలి సభ్యునిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు?
తిరుపతి: ప్రముఖ ప్రవచనకర్త, ఆధ్యాత్మిక ఉపన్యాసకుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావును ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానే వినిపిస్తోంది. టీటీడీ పాలక మండలి సభ్యునిగా ఆయన పేరును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారాన్ని టీటీడీ అధికారులు చాగంటి కోటేశ్వరరావుకు తెలియజేశారని తెలుస్తోంది. దీనికి ఆయన ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాన్నీ తీసుకోలేనని సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. పాలక మండలిలో సభ్యత్వంపై తన నిర్ణయాన్ని కొద్దిరోజుల్లో తెలియజేస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు.
రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన నామినేటెడ్ పోస్టులు ఖాళీ కావాల్సి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ సహా ఇతర సభ్యులు రాజీనామా చేస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వం నియమించిన పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
టీటీడీ నిర్వహణా పర్యవేక్షణలో కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ కె రాఘవేంద్ర రావు, సినిమా, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ అంబికా కృష్ణ, మైనారిటీ కార్పొరేషన్ ఛైర్మన్ జలీల్ ఖాన్ వంటి నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. అదే క్రమంలో ప్రతిష్ఠాత్మక టీటీడీ పాలక మండలి ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కూడా తన పదవికి గుడ్బై చెప్పడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. తన పదవీకాలం మొత్తానికీ కొనసాగుతానంటూ మొదట్లో రాజీనామా చేయడానికి భీష్మించిన ఆయన..ఆ తరువాత బెట్టు సడలించినట్లు చెబుతున్నారు.
ఆయనతో పాటు రాజకీయ అవసరాల కోసం నియమించిన సభ్యులు కూడా త్వరలోనే రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో- ఖాళీ అయ్యే సభ్యుల స్థానాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ పాలక మండలిలో ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి పెద్ద పీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావుకు ఇందులో స్థానం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ఇదే విషయాన్ని టీటీడీ అధికారులకు ఆయనకు తెలియజేయగా.. కొద్దిరోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని బదులు ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదివరకు చంద్రబాబు ప్రభుత్వం ఆయనను రాష్ట్ర సాంస్కతిక మండలి సలహాదారుగా నియమించింది. హంస అవార్డును ఇచ్చి సత్కరించింది. అయినప్పటికీ- రాజకీయాలకు అతీతంగా చాగంటి కోటేశ్వరరావు సేవలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.