వివేకా పీఏకు వేధింపులు? కూతురు, అల్లుడు, సీబీఐ ఎస్పీపై పులివెందుల పోలీసుల కేసు..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో ఆయన పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఫిర్యాదు మేరకు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ .. పీఏ కృష్ణారెడ్డిని పలుమార్లు పిలిపించి విచారించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రెండేళ్ల క్రితం పీఏ కృష్ణారెడ్డి పోలీసుల్ని ఆశ్రయించారు. ఆ తర్వాత పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో అప్పట్లో ఎస్పీగా ఉన్న రామ్ సింగ్ చురుగ్గా దర్యాప్తు చేశారు. దీంతో పీఏ కృష్ణారెడ్డి కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతరం కోర్టుల్ని ఆశ్రయించి ఊరట పొందారు. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తనపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వివేకా కుమార్తె, అల్లుడితో పాటు విచారణ జరిపిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే రామ్ సింగ్ ను టార్గెట్ చేస్తూ పోలీసులు కేసులు నమోదు చేస్తున్న క్రమంలో హైకోర్టు అక్షింతలు వేసింది. దీంతో పోలీసులు వెంటనే కేసు నమోదు చేయలేదు.

దీంతో వివేకా పీఏ కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిన పులివెందుల కోర్టు.. తాజాగా పులివెందుల పోలీసుల్ని పీఏ కృష్ణారెడ్డిని వేధించిన వ్యవహారంలో వివేకా కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో పులివెందుల పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. అయితే రామ్ సింగ్ ఇప్పుడు వివేకా కేసు దర్యాప్తు నుంచి తప్పుకున్నారు. ఆయన స్ధానంలో ఇతర అధికారులు ఈ దర్యాప్తు వ్యవహారం చూస్తున్నారు. దీంతో పులివెందుల పోలీసుల దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications