పురంధేశ్వరి వర్సెస్ సోము వీర్రాజు: చంద్రబాబుకు చెక్కా, పవన్ కల్యాణ్కు గాలమా?
విజయవాడ: బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి మధ్య పోటీ నెలకొని ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో వారిద్దరిలో ఎవరు కూడా బిజెపి అధ్యక్ష పదవికి ఎంపిక కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
దగ్గుబాటి పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కాగా, సోము వీర్రాజు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. పురంధేశ్వరిని ఎంపిక చేస్తే చంద్రబాబుకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఆమె కమ్మ సామాజిక వర్గాన్ని మాత్రమే కాకుండా ఎన్టీ రామారావు అభిమానులను బిజెపి వైపు కూడగట్టే ప్రయత్నాలు చేయవచ్చు. దాని వల్ల తెలుగుదేశం పార్టీ దెబ్బ తినే అవకాశం ఉంది.
బిజెపి కీలక నేత రామ్ మాధవ్తో బిజెపి జాతీయాధ్యక్షుడు సోము వీర్రాజు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సోము వీర్రాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు సన్నిహితుడు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో రాజ్యాధికారాన్ని వాంఛిస్తున్న కాపు సామాజిక వర్గాన్ని బిజెపి వైపు కూడగట్టడానికి వీలవుతుందనేది అంచనా. దీనివల్ల ఇప్పటి వరకు చంద్రబాబుతో లేదా తెలుగుదేశం పార్టీతో ఉన్న కాపులు బిజెపికి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది.
ఆ ప్రమాదాలను పసిగట్టిన చంద్రబాబు వారిద్దరిలో ఎవరు కూడా ఎంపిక కాకుండా తనకు అత్యంత సన్నిహితుడైన కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడి ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు వినికిడి. కమ్మ సామాజిక వర్గానికి చెందిన యడ్లపాటి రఘునాథ బాబును గానీ, జమ్ముల శ్యామ్ కిశోర్ను గానీ బిజెపి ఎపి అధ్యక్షుడిగా ఎంపిక చేయించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు కంభంపాటి హరిబాబు ఎపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవికి రామచంద్రరావుతో పాటు మాజీ శాసనసభ్యుడు ఇంద్రసేనా రెడ్డి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి ఆంద్రప్రదేశ్ కార్యవర్గ సమావేశం రాజమండ్రిలో జరిగింది. ఈ సమావేశంలో హరిబాబుతో పాటు వీర్రాజు, పురంధేశ్వరి, కావూరి సాంబశివ రావు, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.