బెజవాడ ఎంపి అభ్యర్థిగా పురంధేశ్వరి: రేపు నామినేషన్
హైదరాబాద్: సీమాంధ్రలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుపై నీలినీడలు కమ్ముకున్న నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేయనున్నారు. ఎంపి అభ్యర్థిగా ఆమె శనివారం నామినేషన్ వేయనున్నారు. అయితే పొత్తు నేపథ్యంలో ఆమెకు బిజెపి, టిడిపి బలంగా లేని కడప జిల్లాలోని రాజంపేట నియోజకవర్గాన్ని కేటాయించడంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
టిడిపి అభ్యర్థిని ఓడించాలనే ఉద్దేశంతోనే కొందరు బిజెపి నాయకులు పురంధేశ్వరిని విజయవాడ నుంచి బరిలో దింపుతున్నట్లు పలువురు టిడిపి శ్రేణులు పేర్కొంటున్నాయి. అంతేగాక పురంధేశ్వరి విజయవాడ నుంచి పోటీ చేస్తుండటంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత ఎన్టీఆర్ కుమార్తెగా గౌరవిస్తామని ఓట్లు మాత్రం వేయలేమని టిడిపి శ్రేణులు పేర్కొంటున్నాయి.

కాగా, సీమాంధ్రలో ఒంటరిగా పోటీ చేయడంపై తెల్లవారుజాము వరకు కూడా బిజెపి నాయకులు విజయవాడ పార్టీ కార్యాలయంలో చర్చలు జరిపారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాలని ఇప్పటికే పార్టీ అభ్యర్థులకు బిజెపి నాయకులు సూచించినట్లు తెలిసింది. సీమాంధ్రలో 150 స్థానాల్లో పోటీ చేయాలని బిజెపి యోచిస్తోంది.
బిజెపి జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్ శనివారం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. పొత్తులపై చివరిసారి చర్చలు జరపనున్నారు. పొత్తులపై ఈ సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనంతరం పొత్తులతోనే ఎన్నికల్లోకి దిగడమా లేదా ఒంటరిగానే వెళ్లడమా అనే అంశాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ బిజెపి నాయకులు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలలోని పార్టీ కార్యాలయాలకు బిఫాంలు పంపించినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications