టీటీడీ ఇష్యూ: రమణదీక్షితులుపై పుట్టా సుధాకర్ యాదవ్, రంగంలోకి పరిపూర్ణానందస్వామి!
హైదరాబాద్/తిరుపతి: రమణదీక్షితులు అంటే తమకు గౌరవం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ శుక్రవారం తెలిపారు. అయితే టీటీడీలో ఏవైనా సమస్యలు ఉంటే ఆయన పాలక మండలి దృష్టికి తీసుకు రావాలన్నారు. రోజుకో ప్రాంతంలో మీడియా సమావేశాలు పెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. ఆయన అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారు.
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, వైసీపీ అధినేత జగన్ వంటి నేతలను కలవడం సరికాదన్నారు. 24 ఏళ్లుగా ప్రధాన అర్చకుడిగా ఉండి ఇప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

తిరుమల పరిణామాలపై శ్రీపీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి స్పందించారు. తిరుమలలో పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. శనివారం తిరుపతిలో మఠాధిపతులం సమావేశమై పరిష్కార మార్గాలను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు గురువారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని హైదరాబాదులో కలిసిన విషయం తెలిసిందే. ఆయనతో దాదాపు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం ఆయన ఓ టీవీ ఛానల్తో మాట్లాడారు.
ఇక్కడకు తన కష్టాలు చెప్పుకోవడానికి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. తనకు జరిగిన అన్యాయాన్ని జగన్కు వివరించానని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి తనకు జరిగిన అన్యాయంపై వివరించాలని ప్రయత్నించానని కానీ కలిసేందుకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications