వైఎస్ జగన్ డ్రీమ్: మరో నాలుగురోజుల్లో కార్యరూపం: ఎప్పుడు..ఏ జిల్లాలో? ట్రయల్ రన్..సక్సెస్
Recommended Video
శ్రీకాకుళం: దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ వలంటీర్ల వ్యవస్థను రూపొందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్.. మరో నాలుగు రోజుల్లో కార్యరూపం దాల్చబోతోంది. రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రతి కార్డుదారుడికీ ఇంటి వద్దకే బియ్యాన్ని పంపిణీ చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. కార్డుదారులు చౌక డిపోల వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా చేసింది. బియ్యం సంచులను గ్రామ వలంటీర్లే లబ్దిదారుల ఇంటి వద్దకు చేర్చే విప్లవాత్మక పథకం ఇది. శ్రీకాకుళం జిల్లాలో ఆరంభం కానున్న ఈ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని దశలవారీగా రాష్ట్రం అంతటా విస్తరింపజేస్తారు. దీనికోసం పౌర సరఫరాల మంత్రిత్వశాఖ ఓ షెడ్యూల్ ను రూపొందించింది.
నెలకో జిల్లాలో..
వచ్చేనెల శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ఆరంభించనున్నారు. అనంతరం ఒక్కో నెల, ఒక్కో జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు. అక్టోబర్ లో విజయనగరం, నవంబర్ లో పశ్చిమ గోదావరి, డిసెంబర్ లో ప్రకాశం, జనవరి లో కర్నూలు, ఫిబ్రవరిలో అనంతపురం, మార్చిలో నెల్లూరు జిల్లాలో ప్యాకెట్ల రూపంలో సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తారు. బియ్యం పంపిణీ జరగబోతుంది. 5,10, 15, 20 కేజీల ప్యాకెట్ల రూపంలో బియ్యాన్ని అందజేస్తారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, కడప, చిత్తూరు, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ పథకం ఒకేసారి అమల్లోకి వస్తుంది. అప్పటిదాకా ఆయా జిల్లాల్లో బియ్యం పంపిణీ సాధారణంగానే కొనసాగుతుంది.
ట్రయల్ రన్.. సక్సెస్ ఫుల్
తెల్లరేషన్ కార్డుదారుల ఇంటికే బియ్యం బ్యాగులను పంపిణీ చేయాలనే పథకం దేశంలో మరెక్కడా లేదు. అందుకే- దీని అమలు తీరుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తొలి విడతలో శ్రీకాకుళం జిల్లాలో ఆరంభం కానున్నందున.. అధికారులు రెండురోజులుగా జిల్లావ్యాప్తంగా ట్రయల్ రన్ ను నిర్వహిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థకు చెందిన గోదాముల్లో నిల్వ ఉంచి బియ్యం సంచులను లారీల ద్వారా మండల స్థాయి స్టాక్ పాయింట్ (ఎంఎస్ఎల్) చేర్చడంపై ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఎంఎస్ఎల్ పాయింట్ల నుంచి చిన్న వాహనాల ద్వారా వాటిని గ్రామ వలంటీర్లకు అందిస్తారు. తమకు అప్పగించిన వార్డులు, ఇళ్లకు వెళ్లి గ్రామ వలంటీర్లు బియ్యం బ్యాగులను తెల్లరేషన్ కార్డుదారులకు అందజేయాల్సి ఉంటుంది. గార, ఎచ్చెర్ల, సీతంపేట వంటి ప్రాంతాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించారు.
కర్నూలు సోన మసూరి, స్వర్ణ రకాలు..
నాణ్యమైన బియాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ సిద్ధమైన నేపథ్యంలో కర్నూలు సోనా మసూరి, స్వర్ణ రకాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది ప్రభుత్వం. దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయబోతోంది. ఖరీఫ్ సీజన్ లో ఉత్పత్తి అయ్యే బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించిన విషయం తెలిసిందే. రబీ సీజన్ లో చేతికి అందే బియ్యాన్ని సేకరించాల్సి ఉందని పౌర సరఫరాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. బియ్యం సేకరణలో ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఒక్కో నెలలో ఒక్కో జిల్లాలో ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తిస్థాయిలో ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని, ఆ తరువాతే రేషన్ డీలర్ల కొనసాగింపుపై కీలక నిర్ణయం వెలువడొచ్చని అంటున్నారు.
నూకలు 15 శాతానికి కుదింపు
సాధారణంగా చౌక ధరల దుకాణాల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే బియ్యంలో నూకలు (బ్రోకెన్ రైస్) కనిపిస్తుంటాయి. ప్రభుత్వమే దీనికి అనుమతి ఇచ్చింది. తెల్లరేషన్ కార్డుదారులు, ప్రభుత్వ ఆధీనంలోని సంక్షేమ వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యంలో 25 శాతం ఉండేలా ఎప్పటి నుంచో నిబంధనలు ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ శాతాన్ని తగ్గించారు. 25 నుంచి 15 శాతానికి కుదించారు. గతంలోలా బియ్యంలో 25 శాతం నూకలను మిశ్రమం చేసే విధానానికి బదులుగా దాన్ని 15 శాతానికి పరిమితం చేశారు. ఈ నిర్ణయం కాస్తా.. మిల్లర్లకు భారంగా పరిణమించిందని అంటున్నారు. ఒక్కో క్వింటాలు కనీసం 180 రూపాయల మేర అదనపు భారం పడుతుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉందని, మిల్లర్ల సమస్యను పరిష్కరించడానికి విధానపరమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.