జగన్ ఎంపీల దారెటు ? ఏపీ, తెలంగాణ వివాదాలొస్తే ? నిరంజన్, కృష్ణయ్యలతో సమస్యలివే !
ఏపీలో వైసీపీ తరఫున రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో ఇద్దరు తెలంగాణ వారు ఉండటంపై అభ్యంతరాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఏపీ-తెలంగాణ వివాదాలు నెలకొన్న నేపథ్యంలో రాజ్యసభలో ఏపీకి సంబంధించిన సమస్యలపై వీరు ఎలా పోరాడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీలో ఎంతో మంది సమర్ధులు, విధేయులు ఉండగా వారిని కాదని జగన్ నిరంజన్ రెడ్డితో పాటు ఆర్.కృష్ణయ్యను ఎలా ఎంపిక చేస్తారనే వాదన వినిపిస్తోంది.
జగన్ ఎంపీల ఎంపిక
ఏపీలో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్ధానాలకు జరిగే ఎన్నికల కోసం వైసీపీ నలుగురు అభ్యర్ధుల్ని ప్రకటించింది. వీరిలో పాత కాపు విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. మరో మూడు సీట్లలో నెల్లూరు బీసీ నేత బీద మస్తాన్ రావుతో పాటు తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్యలకు చోటు కల్పించారు. దీంతో వీరిని ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాగే వీరి ఎంపికలో రాష్ట్రాన్ని కూడా పట్టించుకోకపోవడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన వీరిద్దరూ ఏపీకి ఎలా న్యాయం చేస్తారన్న వాదన వినిపిస్తోంది.
ఎంపీ అభ్యర్ధుల తెలంగాణ నేపథ్యం
వైసీపీ తెలంగాణ నుంచి ఎంపిక చేసిన ఇద్దరు ఎంపీ అభ్యర్ధులు నిరంజన్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఇప్పటికే ఏపీకి వ్యతిరేకులుగానో,సంబంధం లేని వ్యక్తులుగానో పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకూ ఏపీకి చేసిన సేవ కానీ, ఏపీ రాజకీయాల్లో చురుగ్గా ఉన్న వారు కానీ కాదు. అలాగే గతంలో తెలుగు ప్రజల కోసం ఉమ్మడిగా వీరిద్దరూ ఎక్కడా పనిచేసిన దాఖలాలు కూడా లేవు. కానీ సాంకేతికంగా చెల్లుబాటు అవుతుందన్న కారణంతో మాత్రమే వీరిద్దరినీ జగన్ ఎంపిక చేసేశారు. వీరిలో కృష్ణయ్య వంటి వారికి గతంలో ఏపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన చరిత్ర కూడా ఉంది.
ఏపీ, తెలంగాణ వివాదాల్లో వీరెటు ?
ఏపీ, తెలంగాణ మధ్య గత కొన్నేళ్లుగా అగాధం పెరుగుతోంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు, నేతలు జల వివాదాలతో మరింత దూరం అయ్యారు. ఇప్పటికీ కేటీఆర్ వంటి వారు ఏపీలో మౌలిక సౌకర్యాలపై విమర్శలు చేస్తే ఏపీ మంత్రులంతా వరుసగా కౌంటర్లు ఇచ్చారు.చివరికి కేటీఆర్ వివరణ ఇచ్చుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలతో పాటు జల వివాదాలు కూడా ఇంకా సమసిపోలేదు. ఇప్పటికీ పార్లమెంటులో ఇరు రాష్ట్రాల ఎంపీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటూనే ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ తెలంగాణకు చెందిన నిరంజన్ రెడ్డి, కృష్ణయ్యలను చాలా సులువుగా రాజ్యసభకు ఏపీ నుంచి పంపుతున్నారు. భవిష్యత్తులో వీరు ఏపీ,తెలంగాణ వివాదాలు వస్తే ఎటు నిలబడతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి మాత్రం వైసీపీ దగ్గర సమాధానం లేదు.