Raghu Rama survey: 2024లో అధికారం ఎవరిదో తేల్చేసిన రెబెల్ ఎంపీ: ఆ పార్టీకి షాక్
అమరావతి: ఏపీ రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో సర్వేలు పుట్టుకొస్తోన్నాయి. ఇదివరకు తెలుగుదేశానికి అనుకూలంగా, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు ఏమిటనేది తేలిందంటూ ఓ సర్వే వెలువడింది. ఆ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా పని చేసిన రాబిన్ శర్మ దీని వెనుక ఉన్నారనేది ఆ తరువాత తేలింది. దీని తరువాత జాతీయ మీడియా సంస్థల సర్వేలొచ్చాయి. ఇండియా టీవీ, ఇండియా టుడే, టైమ్స్ నౌ సర్వేలు- మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి.
వాటికి భిన్నంగా..
ఇప్పుడిక తాజాగా వైఎస్ఆర్సీపీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా సర్వేను విడుదల చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ఈ సర్వేల సందడి మొదలు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా రఘురామ సర్వే ఉండటం ఆసక్తిగా మారింది.
టీడీపీకి..
రఘురామ నిర్వహించిన సర్వే ప్రకారం.. 2024 నాటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. 93 అసెంబ్లీ స్థానాలతో విజయఢంకా మోగిస్తుంది. దీనితో పాటు ఇంకో 30 నియోజకవర్గాల్లో టీడీపీ-వైఎస్ఆర్సీపీ మధ్య టైట్ ఫైట్ ఉంటుంది. అందులో కనీసం 15 నుంచి 20 సీట్లు టీడీపీ వైపే మొగ్గు చూపొచ్చు. ఈ 30 సీట్లల్లో అతి తక్కువ మెజారిటీతో అయినా సరే.. టీడీపీ అభ్యర్థులే గెలుస్తారని తేలింది. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే టీడీపీ 127 స్థానాలు వస్తాయని స్పష్టం చేసింది.
వైసీపీకి ఎన్ని..
వైఎస్ఆర్సీపీ విజయం సాధించే స్థానాల సంఖ్య 50కి దాటదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. వైసీపీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుస్తుందని పేర్కొన్నారు. వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు 10లోపే ఉన్నాయనీ వివరించారు. మిగిలిన చోట్లల్లో టీడీపీతో హోరాహోరీ పోరు తప్పదని, అందులోనూ మెజారిటీ సీట్లు టీడీపీ ఖాతాలోకే వెళ్తాయనీ తాను చేయించిన సర్వేలో స్పష్టమైనట్లు రఘురామ చెప్పారు.
సీమలో..
ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోనూ తెలుగుదేశం పార్టీ హవా ఉంటుందని, ఒక్క కడపలో మాత్రమే వైసీపీకి ఎదురు ఉండదని తేల్చేశారాయన. కడప మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ కనీసం గట్టిపోటీ కూడా ఇవ్వలేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వైసీపీ-టీడీపీ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ.. మెజారిటీ సీట్లను ప్రతిపక్ష పార్టీ కొల్లగొట్టేస్తుందని పేర్కొన్నారు.
టీడీపీ-జనసేన కలిస్తే..
కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ప్రభుత్వం అధికంగా ఉంటుందని రఘురామ అంచనా వేశారు. టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని 2024 అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మాత్రం వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు ఏ మాత్రం ఉండబోవని తన సర్వేలో తేలిందని చెప్పారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంక్ ఈ సారి వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించట్లేదని, టీడీపీ లేదా జనసేన వైపు మొగ్గు చూపుతుందని అన్నారు.