రాజ్యాంగేతర శక్తిగా సజ్జల- మంత్రులను కించపరుస్తూ : అనిల్ ను అవమానించేలా : రఘురామ లేఖ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు ముఖ్యమంత్రి జగన్ కు లేఖల సీరియల్ కొనసాగుతోంది. తాజాగా రాసిన లేఖలో రఘురామ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ని టార్గెట్ చేసారు. ఆయన ఏ విషయంపైన అయినా, ఏ సందర్భంలోనైనా, ఎవరినైనా వ్యాఖ్యానించే సాహసవంతుడని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలతో సహా ఎవరూ కూడా ఆయన చేసే విమర్శలను సీరియస్ గా తీసుకోవడం లేదు, సమాధానం కూడా చెప్పడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా మారిపోయారని ప్రజలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారన్నారు.

మంత్రులను కించపరిచేలా..
ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారని చెప్పుకొచ్చారు. ఆయన మంత్రులను కించపరుస్తుంటారని రాసుకొచ్చారు. ప్రభుత్వ కార్యకలాపాలలో పార్టీ కి సంబంధించిన విషయాలను తీసుకువస్తుంటారు. పాలనావ్యవహారాలన్నింటిపైనా తీవ్ర ప్రభావం చూపించాలని ఆయన అనుకుంటూ ఉంటారని చెప్పుకొచ్చారు. అప్రకటిత హోం మంత్రిగా చెలాయిస్తున్న అధికారం కూడా ఇప్పటికే పలువురికి కంటగింపుగా ఉందన్నారు. తాను ప్రభుత్వ సలహాదారుడినే కాదు నాలుగు జిల్లాలకు ఇన్ చార్జిగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నాను అని చెప్పేశారని గుర్తు చేసారు.

మంత్రివర్గంలోకి తీసుకోండి..
మీరు గట్టిగా అనుకుంటే మీరు ఒక పని చేయవచ్చంటూ... అతనిని శాసన వ్యవస్థ లోకి తీసుకురండి. పెద్దల సభకు నామినేట్ చేయడమో లేక శాసనసభ టిక్కెట్ కేటాయించి ఎన్నికలలో నిలబెట్టి గెలిపించుకోవడమో చేయండని సీఎంకు సూచించారు. ఆ తర్వాత ఆయనను మంత్రి వర్గంలోకి తీసుకుని ప్రభుత్వ వ్యవహారాలను మాట్లాడనివ్వండంటూ సూచన చేసారు. మీరు చెప్పాల్సిన విషయాలతో బాటు మంత్రులు అధికారికంగా ప్రకటించాల్సిన అంశాలను కూడా ఆయన యథేచ్ఛగా చెప్పేయడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

అనిల్ ను పక్కన పెట్టేలా..
ఎంతో అద్భుతమైన ప్రతిభ, అర్హత కలిగిన నిపుణుడు అయిన అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తిని నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంచుకుని మీరు సజ్జలతో ఆయన తరపున మాట్లాడించడం, అదీ కూడా నీటిపారుదల లాంటి కీలకమైన అంశాలను చెప్పించడం సబబుగా లేదన్నారు. మిమ్మల్ని కలవాలంటే ఆయన నుంచి అప్పాయింట్ మెంట్ తీసుకోవాల్సి రావడం మరో దురదృష్టకరమైన అంశంగా ఆ ప్రజాప్రతినిధులు తీవ్రమైన మనోవేదన అనుభవిస్తున్నారని రాసుకొచ్చారు. ఆయన అధికారికంగా పోలవరం ప్రాజెక్టు సైట్ ను తనిఖీ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
Recommended Video

మీ పాత్రను పోషిస్తున్నారు..
ఆయన సామర్ధ్యంపై మీకు అత్యంత గొప్ప నమ్మకం ఉంటే ఆయనను మీకు సలహాలు ఇచ్చేవరకూ పెట్టుకోండి. అందుకు ఆయన పాత్రను పరిమితం చేయండి. ఆయన ముఖ్యమంత్రికి ప్రత్యామ్నాయంగా చెలామణి అవుతూ మీ పాత్రను కూడా పోషిస్తున్నారు. మీరు ఇదే విధంగా ఆయనతో ద్విపాత్రాభినయం చేయిస్తుంటే ఎవరో ఒకరు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం తో న్యాయస్థానాల గడప తొక్కవచ్చని... తిరుగులేని ప్రజాదరణ ఉన్న గొప్ప నాయకుడైన మీ ఇమేజి కి అప్పుడు భంగం కలగవచ్చుంటూ రఘురామ లేఖలో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications