కొడాలి నానిని ఇరికించారు: క్యాసినో వ్యవహారంపై రఘురామ, పేర్ని నాని క్షమాపణలు చెప్పాలని ఫైర్
న్యూఢిల్లీ/అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడలోని ఏపీ మంత్రి కొడాలి నానికి చెందిన ఓ ఫంక్షన్ హాల్లో క్యాసినో నిర్వహణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఈ క్యాసినో వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని టీడీపీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ చెబుతోంది.
కొడాలి నానిని అన్యాయం ఇరికించారు: రఘురామ కృష్ణరాజు
తాజాగా, ఈ వ్యవహారంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గుడివాడ క్యాసినోతో మంత్రి కొడాలి నానికి సంబంధం లేదని భావిస్తున్నట్లు చెప్పారు. ఆయన్ని అన్యాయంగా ఇరికించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదెవరు? క్యాసినో డబ్బు ఎవరికి వెళ్లింది? తదితర విషయాలు తేటతెల్లం కావాల్సిన అవసరముందన్నారు రఘురామ కృష్ణరాజు.
చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలా?: పేర్ని నాని క్షమాపణ చెప్పాలి
మరోవైపు, ఏపీ మంత్రి పేర్ని నానిపై రఘురామ కృష్ణరాజు తీవ్రస్తాయిలో మండిపడ్డారు. ఇటీవల సినిమా టికెట్ల ధరలపై సీఎంతో చర్చించేందుకు వెళ్లిన సినీనటుడు చిరంజీవిపై మంత్రి పేర్ని నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. అందుకు పేర్ని నాని క్షమాపణలు చెప్పాలన్నారు. ఏపీలో సినిమా టికెట్ల ధరల విషయంపై సీఎం జగన్తో చిరంజీవి సమావేశమైన విషయం తెలిసిందే. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని... సినిమా పరిశ్రమ నుంచి ఎవరూ కూడా ఈ విషయంలో ఏపీ సర్కారుపై విమర్శలు చేయవద్దని చిరంజీవి సూచించారు.
Recommended Video
తనకు రావాల్సిన డబ్బు ఆపించారంటూ జగన్పై రఘురామ
అంతేగాక, తనపై అనర్హత వేటు వేయించలేమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే తక్షణం రాజీనామా చేస్తానని రఘురామ కృష్ణరాజు సవాల్ విసిరారు. తమిళనాడు నుంచి తనకు రావాల్సిన డబ్బును సీఎం జగన్ నిలిపివేయించారని ఆరోపించారు. ఏపీ సీఐడీ తీరుపై ఇచ్చిన నోటీసుపై చర్య తీసుకోవాలని లోక్సభ స్పీకర్ని కోరినట్లు తెలిపారు. ఇక పీఆర్సీ అంశంపైనా రఘురామ స్పందించారు. ఉద్యోగులకు జీతాలు నిలిపివేస్తే ఆర్థిక అత్యవసర పరిస్థితి తలెత్తుతుందని, సంక్షేమం కంటే ఉద్యోగులకు జీతాలు చెల్లించడం ప్రభుత్వ విధి అని రఘురామ వ్యాఖ్యానించారు. కాగా, పీఆర్సీ విషయంలో అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్ధమైన విషయం తెలిసిందే.