కాస్కో జగన్.. సంచలన శపథం చేసిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికలకు టిడిపి, బిజెపి, జనసేన పొత్తులతో ముందుకు వెళుతున్న క్రమంలో అభ్యర్థుల ప్రకటన జరుగుతోంది. తాజాగా బిజెపి తమ లోక్ సభ అభ్యర్థుల జాబితా ప్రకటించింది. అందులో నరసాపురం స్థానాన్ని భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేటాయించగా, నరసాపురం నుంచి టికెట్ ఆశించిన రఘురామ కృష్ణంరాజుకు చుక్కెదురైంది. తనకు టికెట్ దక్కకపోవడంతో, దీని వెనక జగన్ కుట్ర ఉందన్న రఘురామ కృష్ణంరాజు తాజాగా సంచలన ప్రకటన చేశారు.
సార్వత్రిక ఎన్నికలలో తాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటానని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టంచేశారు. తాజా పరిణామాలపై ఎంతో మంది ఆందోళన వ్యక్తం చేస్తూ తనకు సందేశాలు పంపుతున్నారని, ఫోన్లు చేస్తున్నారని పేర్కొన్న రఘురామ తాను ఎలాంటి ఆందోళనలో లేనని, అలాగని సంతోషంగా కూడా లేనని పేర్కొన్నారు. తనకు జగన్ మార్క్ షాక్ ఇవ్వబోతున్నారు అని, టికెట్టు రాకుండా అడ్డుకుంటున్నారని పిల్ల సజ్జల వెబ్సైట్లు, మీడియా చానల్స్ ముందే చెప్పాయని పేర్కొన్నారు.

అయితే ఇంతకాలం జగన్ తనను డిస్ క్వాలిఫై చేయాలని, ఓ దశలో చంపేయాలని కూడా ప్రయత్నాలు చేశారని పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్టు చేయించి జైల్లో పెట్టి చంపేందుకు జగన్ చేసిన కుట్రలు కూడా విఫలమయ్యాయని స్పష్టం చేశారు. జగన్ చేసిన ప్రయత్నాలు అన్ని విఫలం కాగా, ప్రస్తుతం తనకు టికెట్ రాకుండా తాత్కాలికంగా జగన్ విజయం సాధించారని, తాను అపజయాన్ని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రస్తుతం మూడు అడుగులు వెనక్కు వేస్తున్నానని పేర్కొన్న రఘురామ రానున్న రోజుల్లో ప్రజాబలం, ప్రజల అండతో, ప్రతి వ్యక్తి చేత ముందడుగు వేయించి జగన్ ను అదః పాతాళానికి తొక్కక పోతే నా పేరు రఘురామ కాదని శపధం చేశారు. బిజెపి నేత సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా జగన్ అడ్డుకోగలిగారని, అయితే జగన్ అనుకున్నది మాత్రం తాను జరగనివ్వనని చెప్పారు.
పార్టీలు అన్యాయం చేసినా, ప్రజలు తనకు అన్యాయం చేయరనే విశ్వాసం ఉందని పేర్కొన్న రఘురామ మరో మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తానో చూస్కో జగన్, ఇక కాస్కో జగన్ అంటూ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తాను ప్రజాక్షేత్రంలో ఉండడం ఖాయం అంటూ తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications