రఘురామ వర్సెస్ మిధున్ రెడ్డి - లోక్ సభ వేదికగా : అమరావతి -సీబీఐ కేసుల పై డైలాగ్ వార్..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు వర్సెస్ వైసీపీ ఎంపీలు అన్నట్లుగా పార్లమెంట్ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. లోక్ సభ సాక్షిగా ఒకే పార్టీకి చెందిన ఎంపీల మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. శుక్రవారం లోక్ సభలో ఏపీ ఆర్దిక పరిస్థితి పైన రఘురామ రాజు ప్రస్తావించారు. దీనికి వైసీపీ విప్..రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రియాక్ట్ అయ్యారు. రఘురామ రాజు పైన సీబీఐ కేసుల పైన చర్యలు తీసుకోవాలని ఛైర్ ను కోరగా..దాని పైన సంబంధిత మంత్రిని కోరాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వ తీరుపై రఘురామ
ఇక, ఇప్పుడు రఘురామ రాజు వర్సస్ మిధున్ రెడ్డి గా మారింది. లోక్ సభలో రఘురామ, మిధున్ రెడ్డి ఢీ అంటే ఢీ అనుకొనే స్థాయికి వెళ్లింది. జీరో అవర్ లో రైతుల మహాపాదయాత్రకు పోలీసుల అడ్డంకులు కల్పించడాన్ని తప్పు పట్టిన రఘురామ ఆ అంశాన్ని ప్రస్తావించారు. రఘురామ వ్యాఖ్యలను ఖండించిన వైసీపి లోక్ సభా పక్ష నేత మిధున్ రెడ్డి ఆయన వ్యాఖ్యలపైన అభ్యంతరం వ్యక్తం చేసారు. గాంధేయ పద్దతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్ర చేస్తున్న రైతులను అడ్డుకోవడం అన్యాయమని రఘురామ వ్యాఖ్యానించారు.

ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ
హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని చెప్పుకొచ్చారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేసారు. భూములు ఇచ్చిన రైతులు గాంధేయ మార్గంలో జరుపుతున్న మహాపాదయాత్రకు పోలీసులు తీవ్రమైన అడ్డంకులు సృష్టించడమే కాకుండా రైతులను తీవ్రంగా హింసిస్తున్నారని ఎంపీ రఘురామ వివరించారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ప్రజల ప్రాధమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారంటూ ఎంపీ రఘురామ ఆరోపించారు.

రఘురామ వర్సెస్ వైసీపీ ఎంపీలు
ఈ సమయంలో రఘురామ ప్రసంగాన్ని అడ్డుకునేందు కు వైసీపీ ఎంపీలు ప్రయత్నించారు. సిబిఐ కేసులనుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బిజెపిలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిధున్ రెడ్డి కామెంట్ చేసారు. ఎంపీ రఘురామపై ఉన్న సిబిఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని మిధున్ రెడ్డి డిమాండ్ చేసారు. అయితే.. తన పైన రెండు సీబీఐ కేసులే ఉన్నాయని... సీఎం జగన్ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ కౌంటర్ ఇచ్చారు.
Recommended Video

సీబీఐ కేసుల పైన వాగ్వాదం
రెండు వైపుల నుంచి వాగ్వాదం పెరుగుతుండటంతో స్పీకర్ ఛైర్ సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. హైదరాబాద్ వచ్చిన సమయంలో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్ట్ చేయటం...సుప్రీం బెయిల్ ఇవ్వటంతో ఆయన అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్నారు. ఇక, రఘురామ పైన అనర్హత వేటు కోసం వైసీపీ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. మరో వైపు ప్రభుత్వంలో జరుగుతన్న పరిణామాల పైన రఘురామ ప్రశ్నిస్తూనే ఉన్నారు. దీంతో..ఈ వ్యవహారం రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications