జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్లు
తన అసమాన నటన, గర్జించే డైలాగ్ డెలివరీ, వెండితెరపై మైమరపించే నృత్యాలతో నందమూరి తారకరామారావు జూనియర్ టాలీవుడ్ 'మాస్ కా దాస్' నుంచి గ్లోబల్ స్టార్గా, భారతీయ సినిమా గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు. చిన్న వయసులోనే బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఆయన నేడు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
బాలనటుడిగా నటించి, మెప్పించి..
హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే, 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన 'రామాయణం' చిత్రంలో తారక్ శ్రీరాముడిగా నటించి బాలనటుడిగా మెప్పించారు.ఈ చిత్రం 'ఉత్తమ బాలల చిత్రంగా' జాతీయ అవార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత హీరోగా మారిన తారక్, టాలీవుడ్లో సరికొత్త యాక్షన్ ట్రెండ్కు తెరలేపారు. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్లో 2002లో వచ్చిన 'ఆది' ఎన్టీఆర్కు తిరుగులేని మాస్ ఇమేజ్ను, భారీ ఫ్యాన్ బేస్ను తెచ్చిపెట్టింది. సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఆయన ఈ ఘనత సాధించారు. 20 ఏళ్ల వయసులో 2003లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సింహాద్రి మరో సంచలనం.టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయసులో ఇండస్ట్రీ హిట్లు సాధించిన హీరోగా ఆది, సింహాద్రితో తారక్ ఘనత తెచ్చుకున్నారు.

నెగెటివ్ పాత్రలో సూపర్
2007లో వచ్చి యమదొంగ సోషియో-ఫాంటసీ మూవీ కోసం తారక్ చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. యముడిగా ఆయన చెప్పిన డైలాగ్స్ కల్ట్ క్లాసిక్గా నిలిచాయి. ఈ చిత్రానికి గాను ఆయన తొలిసారి 'బెస్ట్ యాక్టర్'గా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. మారిన కాలంతో పాటు తారక్ తన కథల ఎంపికను మార్చుకుంటూ సక్సెస్ గ్రాఫ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లారు. 2016లో కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ లో క్లాస్, మాస్ ఎలిమెంట్స్తో, పర్యావరణ ప్రేమికుడిగా నటించి బ్లాక్బస్టర్ ఇచ్చారు.2017లో జై లవకుశ సినిమాలో జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలను పోషించి, ముఖ్యంగా 'నత్తి' ఉన్న నెగటివ్ షేడ్స్ పాత్రలో తారక్ చూపించిన నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
విజువల్ వండర్ తో అంతర్జాతీయ స్థాయికి
రాజమౌళి సృష్టించిన ఆర్ఆర్ఆర్ విజువల్ వండర్లో కొమరం భీమ్గా తారక్ నటన అంతర్జాతీయ ప్రేక్షకులను సైతం కదిలించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం, 'నాటు నాటు' సాంగ్తో ఆస్కార్ అవార్డును గెలుచుకుని ప్రపంచ వేదికపై తెలుగు సినిమా జెండాను ఎగరేసింది.
వెండితెరపైనే కాదు, బుల్లితెరపై కూడా తారక్ తన మాటకారితనంతో ప్రేక్షకులను కట్టడి చేశారు. తెలుగులో ప్రారంభమైన మొదటి 'బిగ్ బాస్' (సీజన్-1) షోకు హోస్ట్గా వ్యవహరించి, దానికి రికార్డు స్థాయి టీఆర్పీని తెచ్చిపెట్టారు. ఆ తర్వాత 'ఎవరు మీలో కోటీశ్వరులు' గేమ్ షోను కూడా తనదైన శైలిలో నడిపించి బుల్లితెర వీక్షకులను ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications