బాబుకు రఘువీరా సవాల్: తమ్ముళ్లకు కట్టబెట్టేందుకే
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీలో ఎర్రచందనం స్మగ్లర్లు ఉన్నారనే చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కాంగ్రెసు పార్టీలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ల పేర్లను 24 గంటల లోపు బయటపెట్టాలని, లేదంటే క్షమాపణ చెప్పాలని ఆయన చంద్రబాబును సవాల్ చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆర్టీసి కార్మికుల సమ్మెకు కాంగ్రెసు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోందని ఆయన అన్నారు. సమ్మెకాలంలో పనిచేస్తున్న ప్రైవేట్ ఆపరేటర్లంతా టిడిపికి చెందినవారేనని ఆయన అన్నారు. ఆర్టీసిని ప్రైవేటీకరించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, టిడిపి నాయకులకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళనను తీవ్రం చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, ఏ చట్టం చేసి ప్రత్యేక హోదా ఇచ్చారో ఆ రాష్ట్రం పేరు చెప్పాలని ఆయన అన్నారు. ఈ నెల 13వ తేదీ లోపు లక్ష కోట్లతో ప్రత్యేక హోదాతో రాష్ట్రంలో అడుగు పెట్టాలని ఆయన టిడిపి, బిజెపి ఎంపీలను సవాల్ చేశారు. లేదంటే 14వ తేదీన ఇందిరా భవన్లో అన్ని జిల్లాల అధ్యక్షులతో పిసిసి కార్యవర్గంతో సమావేశమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పకడ్బందీ వ్యూహం రచించి, అమలు చేస్తామని ఆయన చెప్పారు.
తెలంగాణలో మద్దతు, ఎపిలో వ్యతిరేకతనా..
ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు తెలంగాణలో మద్దతు ఇస్తున్న టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వ్యతిరేకిస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు.
టిడిపి తన వైఖరిని ఈ విషయంలో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు గుర్తు లేవా అని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.