కాంగ్రెసు ఆశలు గల్లంతు: జగన్పై దుమ్మెత్తిపోసిన రఘువీరా
మోడీతో జగన్ భేటీ కాంగ్రెసు పార్టీకి ఏ మాత్రం రుచించడం లేదు. దాంతో వైఎస్ జగన్పై ఎపి కాంగ్రెసు అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తవ్రంగా ధ్వజమెత్తారు.
కాకినాడ: ప్రధాని నరేంద్ర మోడీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి భేటీ కావడం కాంగ్రెసు పార్టీని నిరాశపరిచినట్లే ఉంది. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసుతో కలిసి పనిచేద్దామనే కాంగ్రెసు ఆలోచనలకు దానివల్ల గండి పడినట్లు తెలుస్తోంది.
దాంతో వైయస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మోడీ, జగన్ భేటీతో మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో తెగదెంపులు చేసుకుని బిజెపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో జత కట్టే సంకేతాలు అందుతున్నాయి.
ఆ పరిణామాలను జీర్ణించుకోలేని స్థితిలోనే రఘువీరా రెడ్డి జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రఘువీరా రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
హోదా ముసుగు తొలగింది...
నిన్న, మొన్నటి వరకు హోదాపై పోరాటం చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నేడు బీజేపీతో కలిసి హోదా ముసుగును తొలగించారని రఘువీరారెడ్డి విమర్శించారు. ప్రత్యేక హోదాపై జగన్ పోరాడుతున్నారని అందరూ అనుకున్నారని, తాజాగా మోదీ పంచన చేరి హోదాను తాకట్టుపెట్టారని విమర్శించారు.
జగన్ మద్దతు విడ్డూరం..
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికి వదిలేసి రాష్ట్రపతి ఎన్నికకు మద్దతు ఇస్తామని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని రఘువీరా రెడ్డి అన్నారు. దివంగత నేత, జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బీజేపీతోనే పోరాటం చేశారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్రు 14 రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు.
బ్రహ్మాండమైన జోడీ అని...
చంద్రబాబు, నరేంద్ర మోడీ బ్రహ్మాండమైన జోడీ అని గత ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపిస్తే ప్రజల మనోభావాలను దెబ్బతీశారని, వారిని నట్టేట ముంచారని రఘువీరా రెడ్డి అన్నారు. హోదా ముగిసిన అధ్యాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాషా్ట్రనికి హోదా ఇస్తేనే మద్ధతు ఇస్తామనే షరతును వైసీపీ, టీడీపీలు విధించాలని ఆయన సూచించారు.
పోరాటం చేస్తాం..
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వచ్చే జూన్ 30వ తేదీ నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని రఘువీరారెడ్డి తెలిపారు. కాకినాడలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పింఛన్లు, రేషన్ కార్డులు ఆశ చూపి టీడీపీ సభ్యత్వాలు నమోదు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేయించేవి నిఖార్సయిన సభ్యత్వాలని చెప్పారు. ఈనెల 15 నాటికి సభ్యత్వ నమోదు పూర్తవుతుందని, జులైలో సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని పిలుపునిచ్చారు.