జగన్ కన్నా ముందే: రఘువీరాకు రాహుల్ ఫోన్, ప్రత్యేక హోదాపై వార్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడానికి ఏ స్తాయిలో పోరాటం చేసినా తాను ముందుండి నాయకత్వం వహిస్తానని రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి సూచించారు. ఈ మేరకు ఆయన శనివారంనాడు రఘువీరాకు ఫోన్ చేసి చెప్పారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి కూడా ఇవ్వలేమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ గాంధీ తన వ్యూహానికి పదును పెడుతున్నారు.
అయితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కన్నా ముందే ధీటైన పోరాట వ్యూహాన్ని ఖరారు చేసుకుని ముందుకు దూకాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో ధర్నా చేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన పేరు జగన్కు దక్కకుండా తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయోజనం పొందాలనే ఉద్దేశంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ ధర్నా కన్నా ముందే పార్లమెంటులో ప్రత్యేక హోదాపై పోరాటానికి శ్రీకారం చుట్టే ఆలోచనలో రాహుల్ గాంధీ ఉన్నారు. అందుకుగాను ఆయన ఈ నెల 3వ తేదీన పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నారు.
ప్రత్యేకహోదాపై ఇటు బిజెపిని, అటు తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా పార్లమెంటులో వ్యవహరించాలని రాహుల్ గాంధీ ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరిగి బలం పుంజుకోవడానికి ఇంతకన్నా మంచి అవకాశం రాదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇదే సమయంలో అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో ఈ నెల 3వ తేదీన కాంగ్రెసు కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదాపై చేసే పోరాట కార్యాచరణను రూపొందిస్తారని అంటున్నారు. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ దూకుడుగా వ్యవహరించాలని రాహుల్ గాంధీ అభిమతంగా తెలుస్తోంది.
ఏపీకి ప్రత్యేక హోదాపై పోరాటానికి సిద్ధంకావాలని ప్రజలకు రఘువీరా పిలుపునిచ్చారు. టీడీపీ బీజేపీ లు ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. చంద్రబాబు వెయ్యిజన్మలు అధికారంలో ఉన్నా ప్రత్యేక హోదా సాధించలేరని రఘువీరా ఎద్దేవా చేశారు.