హోదాపై మోడీకి రాహుల్ లేఖ, 99శాతం హిందువులే వెనక్కి: బిజెపిపై ఆజాద్ నిప్పులు
హైదరాబాద్/ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పార్లమెంటులో ఇచ్చిన హామీని, అలాగే గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రధాని మోడీ నిలబెట్టుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు.
ప్రధాని మోడీ ఏం చెబుతారో: రఘువీరా
ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... రాజధాని అమరావతికి కేంద్రం వెంటనే నిధులు మంజూరు చేయాలన్నారు. శంకుస్థాపన కోసం వస్తున్న ప్రధాని మోడీ అమరావతి వేదిక నుంచి ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రకటన చేస్తారోనని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
అమరావతిలో భోజన ఏర్పాట్లు
అమరావతి శంకుస్థాపనకు వచ్చే రైతులు, ప్రజలకు భోజనం పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ రోజు సుమారు లక్షన్నర మందికి భోజనం పెట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమానికి వచ్చే వారికి పులిహోర, చక్కెర పొంగిలి, దద్దోజనం, తాపేశ్వరం కాజా, అరటిపండు ప్యాకింగ్ చేసి ఇవ్వాలని నిర్ణయించారు. వివిఐపిలకు ప్రత్యేక మెను సిద్ధం చేస్తున్నారు.
హైదరాబాదులో బిజెపిపై కాంగ్రెస్ నేతల నిప్పులు
హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సుహృద్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, దిగ్విజయ్ సింగ్ తదితరులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సుహృద్భావాన్ని సోనియా గాంధీ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు పాటిస్తారని దిగ్విజయ్ అన్నారు.
దేశాన్ని కలిపేది కాంగ్రెస్ పార్టీ అయితే, విడదీసేది బిజెపి అన్నారు. బిజెపికి ఓటు శాతం 31 మాత్రమేనని, మిగతా అందరూ ఆ పార్టీకి వ్యతిరేకమే అని చెప్పారు.
గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ... దేశంలో సంస్కరణలకు ఆజ్యం పోసింది రాజీవ్ గాంధీయే అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వమే మతతత్వాన్ని ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీ నేతల చేష్టలు, మాటలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయన్నారు.
పలువురు రచయితలు తమ అవార్డులు వెనక్కి ఇవ్వడం శుభసూచకమన్నారు. అవార్డులు వెనక్కి ఇచ్చిన వారిలో 99 శాతం మంది హిందువులేనని చెప్పారు. మెజార్టీ హిందువులు లౌకికవాదులు అయినంత కాలం మైనార్టీలకు ఏం కాదన్నారు. భారత్లో లౌకికవాదం చావదని చెప్పారు.