భారీ వర్షంతో మళ్లీ జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు: ఫిర్యాదు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి మరోసారి వర్షం నీరు వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి సచివాలయంలోని పలు గదుల్లోకి నీరు చేరింది. సచివాలయం ప్రాంగణం చెరువులా మారిపోయింది.
భారీ వర్షం కారణంగా సచివాలయం గేట్-2 వెయిటింగ్ హాల్లోకి కూడా నీరు చేరింది. అంతేగాక, అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్లోకి మరోసారి వర్షపు నీరు చేరింది. సీలింగ్ నుంచి నీరు లీకేజీ జరిగింది.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటరీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. కాగా, బాత్రూం నుంచి ఎలక్ట్రిక్ రూంలోకి కూడా నీరు వచ్చి చేరింది. గతంలో కూడా వైయస్ జగన్ ఛాంబర్లోకి వర్షపు నీరు వచ్చిన విషయం తెలిసిందే.
మంగళవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా.. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం విజయవాడలో కురిసింది. అప్పటి వరకు ఎండవేడిమితో తల్లడిల్లిపోయిన ప్రజలు.. భారీ వర్షంతో వాతావరణం చల్లబడటంతో కాస్త సేద తీరారు.