గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్.. భారత్ ను ఉద్దేశించి కాదు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు. అయితే గ్రీన్ కార్డ్ కొత్త రూల్స్ పై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ కొత్త గ్రీన్ కార్డ్ విధానం "భారత్ ను ఉద్దేశించి కాదు" అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం విస్తృత ప్రపంచ వలస సంస్కరణల్లో భాగమని ఆయన పేర్కొన్నారు. "ఇది భారత్ ను ఉద్దేశించి కాదు.. ప్రపంచం మొత్తం గురించి" అని రూబియో వివరించారు. ఈ విధానం ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న అనేక మంది చట్టబద్ధమైన వలసదారులు దేశం విడిచి విదేశాల నుంచి శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవాలి.
పెద్ద వలస సంక్షోభాన్ని ఎదుర్కొన్నందున అమెరికా తన వలస వ్యవస్థను సంస్కరించాలని రూబియో తెలిపారు. "మా వలస వ్యవస్థను క్రమబద్ధీకరించడానికి, మెరుగుపరచడానికి అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. వాస్తవం ఏమిటంటే.. ఈ విషయం ప్రతి దేశానికి అర్థం అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది భారతదేశం గురించి కాదు. ఇది మనం ఎదుర్కొంటున్న ప్రపంచ పరిస్థితి," అని ఆయన అన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం.. దాదాపు 20 మిలియన్లకు పైగా ప్రజలు అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని, గ్రీన్ కార్డ్ వ్యవస్థ దుర్వినియోగాన్ని చూశామని రూబియో గుర్తు చేశారు.
"దురదృష్టవశాత్తు.. మా దేశం చాలా తీవ్రమైన వలస సంక్షోభాన్ని ఎదుర్కొంది. అందుకే దానిని సంస్కరించాలని నిర్ణయించుకున్నాము," అని ఆయన వివరించారు. ఈ సంస్కరణల వల్ల దరఖాస్తుదారులకు స్వల్పకాలికంగా కొన్ని ఇబ్బందులుంటాయని రూబియో అంగీకరించారు. "ఎప్పుడైనా ఒక వ్యవస్థను సంస్కరిస్తే, కొన్ని అంతరాయాలు, అవాంతరాలు, అసౌకర్యాలు ఉంటాయి," అని తెలిపారు. యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం.. అమెరికాలో గ్రీన్ కార్డ్ల కోసం "adjustment of status" దరఖాస్తులు విచక్షణాధికారం కిందకు వస్తాయి. ఇవి విదేశాల్లో సాధారణ కాన్సులర్ ప్రాసెసింగ్ కు ప్రత్యామ్నాయం కాకూడదు. ఈ నిర్ణయం విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు, హెచ్-1బీ కార్మికులతో సహా తాత్కాలిక వీసా హోల్డర్లపై ప్రభావం చూపుతుంది. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్ లు, దేశాల వారీగా ఉన్న పరిమితుల కారణంగా భారతీయ సాంకేతిక నిపుణులు ఈ ప్రక్రియపైనే ఆధారపడుతున్నారు.
అయితే కొత్త వ్యవస్థ కాలక్రమేణా మరింత స్థిరంగా.. సమర్థవంతంగా మారుతుందని రూబియో అభిప్రాయపడ్డారు. "ఇది చాలా ఆచరణీయంగా ఉంటుంది. దీర్ఘకాలంలో, ఇది వారికి, మన దేశానికి కూడా మరింత సమర్థవంతంగా, మెరుగ్గా ఉంటుందని అమెరికాకు రావాలనుకునే భారతీయులు గ్రహిస్తారు," అని ఆయన పేర్కొన్నారు. భారత్ కు చేరుకున్న రూబియో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వాణిజ్యం, రక్షణ, శక్తి, ఇండో-పసిఫిక్ సహకారంపై చర్చలు జరిపారు.

ఈ పర్యటనలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి మోదీకి వైట్ హౌస్ను సందర్శించాల్సిందిగా ఆహ్వానాన్ని కూడా రూబియో అందజేశారు. అదే రోజు దిల్లీలోని యూఎస్ ఎంబసీ సపోర్ట్ అనెక్స్ బిల్డింగ్ కార్యక్రమంలో, వ్యాపార యాత్రికులపై దృష్టి సారించిన కొత్త "అమెరికా ఫస్ట్" వీసా షెడ్యూల్ను రూబియో ప్రకటించారు.












Click it and Unblock the Notifications