దూసుకొస్తున్న వాయుగుండం - ఈ జిల్లాల్లో భారీ వర్షాల పై తాజా అలర్ట్...!!
వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వాయుగుండం ప్రభావంతో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పైన హెచ్చరిక చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బలపడి వాయుగుండంగా కేంద్రీకృతమైంది. దీని ప్రభావంతో వాయవ్య, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంతో పాటు ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 40 నుండి 60 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
యువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్స్ జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంది. మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. ఇదే సమయంలో తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది.

మారుతున్న వాతావరణం.. తాజా అలర్ట్స్
కాగా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అదే విధంగా తెలంగాణలో సైతం వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో సోమవారం మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత వారం తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురివగా.. తాజా హెచ్చరికలతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications