Dimagi Naxal Party: మోడీ వ్యాఖ్యలతో మరో కొత్త పార్టీ- లక్షల ఫాలోయర్లు..!
గతంలో ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసిన బొద్దింకల వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. అంతే కాదు రోజుల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో ఫాలోయర్లను సంపాదించుకుంది. దీన్ని ముందుగా లైట్ తీసుకున్న కేంద్రం.. ఆ తర్వాత దాని అకౌంట్లను బ్లాక్ చేయిస్తూ పోయింది. చివరికి జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా పెట్టి.. పార్లమెంట్ మార్చ్ కు పిలుపునిచ్చిన యువత.. నీట్ అక్రమాలకు బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయించింది. ఇది చరిత్ర. తాజాగా ప్రధాని మోడీ చేసిన ఓ విమర్శ మరో పార్టీకి ప్రాణం పోసింది. అదే దిమాగీ నక్సల్ పార్టీ (dimagi naxal party).
ప్రధాని మోడీ ఈసారి ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో దిమాగీ నక్సల్స్ అనే పదం వాడారు. దీని అర్దం మేథావులైన నక్సల్స్. గతంలో దేశానికి సమస్యగా మారిన నక్సల్స్ ను ఏరిపారేశామని, ఇప్పుడు దిమాగీ నక్సల్స్ సమస్యగా మారిందంటూ ఈ మధ్య కాలంలో బీజేపీని, కేంద్రాన్ని టార్గెట్ చేస్తున్న మేథావుల్ని, విద్యార్దుల్ని, విపక్షాల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే సత్తా చాటుకున్న కాక్రోచ్ జనతా పార్టీతో పాటు విపక్షాలు కూడా మండిపడుతున్నాయి. దీంతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వివరణ కూడా ఇచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలోనే గతంలో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలోనే ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ, దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ పేరుతో కొత్త కౌత్త అకౌంట్లు పుట్టుకొచ్చాయి. ఎక్స్, ఇన్ స్టాతో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇవి ఇప్పుడు దర్శనమిస్తున్నాయి. వీటికి భారీ సంఖ్యలో ఫాలోయర్లు కూడా వచ్చేస్తున్నారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ తరహాలో దిమాగీ నక్సల్ పార్టీ కూడా ఇప్పుడో ఉద్యమంగా మారుతుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాక్రోచ్ పార్టీ నేతలు తమను లైట్ తీసుకున్న కేంద్రానికి సత్తా చూపించారు. ఇప్పుడు దిమాగీ నక్సల్ పార్టీ పేరుతో పుట్టుకొస్తున్న వారు కూడా ఒత్తిడి పెంచడం ప్రారంభిస్తే కచ్చితంగా కేంద్రానికి ఇబ్బందులు తప్పవు.














Click it and Unblock the Notifications