Arshdeep Singh: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే తొలిసారి..
భారతీయ రక్తం, పంజాబీ పౌరుషం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో దేశ పేరును మారుమోగేలా చేశాయి. భారతీయ సంతతికి చెందిన 28 ఏళ్ల అర్ష్దీప్ సింగ్ డాంగ్ బ్రిటన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్గా ఎంపికై చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ వైమానిక దళంలో ఫైటర్ స్క్వాడ్రన్ నుంచి అధికారికంగా 'వింగ్స్' సాధించిన మొదటి సిక్కు యోధుడిగా అర్ష్దీప్ నిలిచారు. నార్త్ వేల్స్లోని ఆర్ఏఎఫ్ వ్యాలీలో శుక్రవారం జరిగిన వేడుకలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. పంజాబ్లోని చండీగఢ్లో జన్మించిన అర్ష్దీప్, ఆరేళ్ల వయసులోనే తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్కు వెళ్లారు.
అర్ష్దీప్ విమానాన్ని అధిరోహించేందుకు సాగించిన ప్రయాణం సామాన్యమైనది కాదు. లండన్లోని రోడ్సైడ్ కలల నుంచి బ్రిస్టల్ యూనివర్సిటీలో మేథ్స్, ఫిలాసఫీ చదువుతూనే వైమానిక రంగానికి ఆకర్షితులయ్యారు. 2022లో ఆఫీసర్ శిక్షణ, 2023లో ప్రాథమిక ఫ్లయింగ్ కోర్సు పూర్తి చేసి సైప్రస్లో పనిచేశారు. ఆయన లోని అత్యుత్తమ ప్రతిభను గుర్తించి 2024లో 'ఫాస్ట్ జెట్ స్ట్రీమ్'కు ఎంపిక చేశారు. ఆ తర్వాత 2025లో టెక్సాస్లో సోలో ఫ్లయింగ్, 2026 జులైలో వింగ్స్ టెస్టులో నెగ్గి చరిత్ర సృష్టించారు. ఫ్రంట్లైన్ ఫైటర్ జెట్లను నడిపేందుకు మరో ఏడాది పాటు ఆయన అత్యంత కఠినమైన అధునాతన శిక్షణ పొందనున్నారు.

'చర్దీ కలా' స్పిరిట్.. ఆకాశంలోనూ తగ్గని విశ్వాసం!
ఈ అద్భుత ఘనత వెనుక ఒక తరం నెరవేరని కల ఉంది. అర్ష్దీప్ తండ్రి జగదీప్ సింగ్ను పైలట్గా చూడాలని ఆయన తాతగారు సర్దార్ సంతోఖ్ సింగ్ కలలు కన్నారు. కానీ తండ్రి చిన్నతనంలోనే తాతగారు మరణించడంతో ఆ అవకాశం దక్కలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాత కలను మనవడు నెరవేర్చారు. సంక్షోభ పరిస్థితుల్లోనూ గురుద్వారా పెంపకం, పంజాబీ సాంప్రదాయంలో చెప్పే 'చర్దీ కలా' (ఎప్పుడూ ఉన్నతమైన మనోధైర్యంతో ఉండటం) అనే భావన తనకు విమానం నడిపే సమయంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చాయని అర్ష్దీప్ తెలిపారు.
భారతీయ విమానయాన చరిత్రకు తిరుగులేని వారసత్వం!
బ్రిటిష్ సైనిక విభాగంలో భారతీయులు తమ ప్రతిభను చాటడం ఇదే తొలిసారి కాదు. మొదటి ప్రపంచ యుద్ధం నాటి 'ఫ్లయింగ్ ఏస్' ఇంద్రలాల్ రాయ్, పంజాబీ శూరులు హర్దీత్ సింగ్ మాలిక్, స్క్వాడ్రన్ లీడర్ మొహిందర్ సింగ్ పుజ్జీ వంటి ఎంతో మంది ధీరుల వారసత్వాన్ని అర్ష్దీప్ పునరావృతం చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ గౌరవం దక్కించుకున్న ఏకైక సిక్కుగా నిలిచినా.. తానూ ఆఖరి వ్యక్తి కాకూడదని, రాబోయే తరాలకు ప్రేరణగా నిలవడమే తన లక్ష్యమని అర్ష్దీప్ ఆశాభావం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications