భారత సంతతి బిలియనీర్ ప్లాంట్పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, ఉత్పత్తికి బ్రేక్!
ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీ స్వస్థలమైన క్రివి రిహ్లోని 'ఆర్సెలార్ మిట్టల్' మైనింగ్ అండ్ మెటలర్జికల్ కాంప్లెక్స్పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. భారత సంతతికి చెందిన బిలియనీర్ లక్ష్మీ మిట్టల్ యాజమాన్యంలోని ఈ ప్లాంట్ ఉక్రెయిన్లోనే అతిపెద్ద ఉక్కు ఉత్పత్తి కేంద్రం. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ సరఫరా, బ్లాస్ట్ ఫర్నేస్లకు తీవ్ర నష్టం వాటిల్లడంతో ఫ్యాక్టరీలో ఉత్పత్తిని పాక్షికంగా నిలిపివేసినట్లు యాజమాన్యం ధ్రువీకరించింది.
రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు
రష్యా భూభాగంపై ఉక్రెయిన్ చేపట్టిన వందలాది డ్రోన్ దాడులకు ప్రతీకారంగానే రష్యాఈ చర్యకు పూనుకుంది. రష్యాపై కీవ్ జరిపిన దాడులలో దాదాపు 822 డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని రష్యా ప్రకటించింది. అయినప్పటికీ ఉక్రెయిన్ జరిపిన దాడుల వల్ల రష్యా ప్రాంతాల్లో ఆరుగురు మరణించినట్లు మాస్కో ప్రాంత గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ వెల్లడించారు.

మాస్కో, రోస్టోవ్ ప్రాంతాల్లో నష్టం
మాస్కో వైపు వచ్చిన దాదాపు 600 డ్రోన్లలో ఒక మూడొంతుల వరకు నగర సరిహద్దుల్లోనే ధ్వంసమయ్యాయి. కానీ ఓ ప్రైవేట్ ఇంటిపై పడిన డ్రోన్ దాడిలో 83 ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. రష్యాలోని ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం వైల్డ్బెర్రీస్ గోదాంపై కూడా దాడి జరగడంతో భారీగా అగ్నిప్రమాదం సంభవించింది. ఇక రష్యా నైరుతి ప్రాంతమైన రోస్టోవ్పై 150కి పైగా డ్రోన్లతో జరిపిన దాడుల్లో ఐదుగురు మరణించగా.. అనేక ఇళ్లు, రైల్వే స్టేషన్ దెబ్బతిన్నాయి.
యుద్ధంలో మారుతున్నవ్యూహాలు
గత నాలుగున్నర ఏళ్లుగా సాగుతున్న ఈ యుద్ధంలో ప్రస్తుతం నేరుగా భూతలంపై పోరాటాలు తగ్గిపోయాయి. శాంతిచర్చలు కూడా నిలిచిపోవడంతో ఇరుదేశాలు సుదూర ప్రాంతాలపై డ్రోన్లు, క్షిపణి దాడులకు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా సైనిక స్థావరాలు, ఇందన కేంద్రాలు, పారిశ్రామిక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో పౌరులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
ఉక్రెయిన్ ఇతర ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం
కేవలం క్రివి రిహ్ మాత్రమే కాకుండా ఉక్రెయిన్లోని ఇతర కీలక ప్రాంతాలపైనా రష్యా విరుచుకుపడింది. ఆగ్నేయ జపోరిజ్జియా, సుమీ సరిహద్దులు, తూర్పు డొనెట్క్స్ ప్రాంతాల్లో పలువురు మరణించారు. రాజధాని కీవ్లోని అతిపెద్ద పుస్తక మార్కెట్తో పాటు పోచైనా మెట్రో స్టేషన్ సమీపంలోని అనేక వ్యాపార కేంద్రాలు మంటల్లో బూడిదయ్యాయి.














Click it and Unblock the Notifications