ఏపీకి కేంద్రం కొత్త వరం - చంద్రబాబు భేటీతో..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర మంత్రులను కలిసారు. ఢిల్లీలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు సుదీర్గంగా మంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏపీలో విమానాశ్రయాల విస్తరణ గురించి చంద్రబాబు చర్చించారు. కేంద్రం ప్రతిపాదనలను మంత్రి వివరించారు. ఈ సమావేశంలో చర్చించిన తరువాత కేంద్ర మంత్రి ఏపీకి సంబంధించి కీలక ప్రకటన చేసారు.
కీలక ప్రకటన
ఏపీలో 14 ఎయిర్ పోర్టులను అభివృద్ధి చేస్తామని మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏడు విమానాశ్రయాల్లో కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. విశాఖపట్టణం, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కర్నూలు, కడప విమానాశ్రయాల్లో రాకపోకలు సాగుతున్నాయని వివరించారు. టెర్మినల్ భవనాల విషయంలో అవసరాల మేర ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై చర్చించామని చెప్పారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు గురించి చర్చ జరిగిందని... రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే విమానయాన శాఖ తరపు నుంచి వెంటనే చర్యలు చేపడతామని రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.

దశల వారీగా
కుప్పం, దగదర్తి (నెల్లూరు), నాగార్జున సాగర్, తునిలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధి కోసం పలు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. తాడేపల్లిగూడెంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ డెవలప్ చేసే అంశం గురించి ఆలోచన చేస్తామని వివరించారు. సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన ప్రతిపాదనలకు తమ శాఖ నుంచి పూర్తిస్థాయిలో సహకారం ఉంటుందన్నారు. పుట్టపర్తిలో ఉన్న ప్రైవేటు విమానాశ్రయాన్ని పబ్లిక్ విమానాశ్రయంగా మార్చే అంశం గురించి చర్చించామని చెప్పారు. విమానాశ్రయాల కనెక్టివిటీ పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఉడాన్ పథకం ఉందని చెప్పుకొచ్చారు.

విమాన సర్వీసులు
ఉడాన్ పథకం ఉపయోగించుకుని రాష్ట్రంలో విమానాశ్రయాల కనెక్టివిటీని మరింత పెంచాలని చూస్తున్నామన్నారు. ప్రతి జిల్లాకు ఒక హెలిపోర్టు ఏర్పాటు చేసి పర్యాటకం, మెడికల్ ఎమర్జెన్సీ సందర్భాల్లో ఆ సేవలు వినియోగించుకునేలా ప్రతిపాదనలు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు వివరించారు. విజయవాడ విమానాశ్రయానికి ముంబై నుంచి రెండు, ఢిల్లీ నుంచి ఒకటి, బెంగళూరు నుంచి ఒకటి, విశాఖపట్నం నుంచి ఒక సర్వీసులను త్వరలో ఏర్పాటు చేస్తామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications