పోలీసులమని చెప్పి గ్యాంగ్ రేప్లు: ముఠాలో బిజెవైఎం నేత
తిరుపతి: క్రైం పోలీసులమని బెదిరిస్తూ వ్యభిచార గృహాలకు వెళ్ళి సామూహిక అత్యాచారాలకు పాల్పడటం, వారిని చిత్రహింసలకు గురిచేసి దోపిడీకి పాల్పడడం వంటి నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను తిరుపతి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్ కూడా ఉన్నారు. నగరంలోని సప్తగిరినగర్కు చెందిన భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్, నవ జన సమాజ ఫెడరేషన్ (ఎన్జెఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్, మరో ఇద్దరు యువకులతో కలసి ఓ ముఠాగా ఏర్పడినట్లు తిరుపతి ఈస్ట్ డిఎస్పీ రవిశంకర్ రెడ్డి తెలిపారు.
వారు గత నెల 27న రాజీవ్నగర్ పంచాయతీలోని శ్రీనగర్ కాలనీలో ఉండే వ్యభిచార గృహ నిర్వాహకుడు గంగాధరం ఇంటికి వెళ్లి క్రైం పోలీస్ స్టేషన్ ఎస్సైలుగా పరిచయం చేసుకుని అక్కడ ఉన్న ఇద్దరు మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డమే కాక వారివద్ద ఉన్న నగదు సైతం దోచుకెళ్ళారని రవిశంకర్రెడ్డి తెలిపారు. అదే రోజు రాత్రి మళ్ళీ గంగాధరానికి ఫోన్ చేసి ఆయనింట్లో వున్న ఓ మహిళను గోవిందరాజస్వామి పుష్కరిణి వద్దకు తీసుకురమ్మని బెదిరించారన్నారు.
అక్కడికి వెళ్ళిన మహిళను విశ్వనాథ్తో పాటు అతడి ముగ్గురు స్నేహితులు సమీపంలోని లాడ్జిలో బంధించి సామూహిక అత్యాచారం చేశారని ఆయన తెలిపారు. మళ్ళీ ఈనెల 10న తిరుపతికి చెందిన బ్రోకర్ వంశీని బెదిరించి ఆయన దగ్గరున్న ఓ యువతిని ఈ ముఠా తీసుకెళ్ళిందని చెప్పారు. క్రైం పోలీసులమని బెదిరించగా ఆ యువతి ప్రతిఘటించటంతో ఆమెను షటిల్ బ్యాట్తో కొట్టి గదిలో నిర్బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆమె వద్ద ఉన్న నగదు దోచుకుని వెళ్లిపోయారు. ఆ యువతి అతికష్టం మీద పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఎస్పీ గోపీనాథ్ ఆదేశాలతో ఈస్ట్ డీఎస్పీ రవిశంకర్రెడ్డి, అలిపిరి సీఐ శ్రీనివాసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్యాంగ్ రేప్తోపాటు అనేక సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోమవారం ఆ ఇద్దరితో పాటు వారి స్నేహితులు హేమంత్, దామోదరంతో పాటు బ్రోకర్లు గంగాధరం, వంశీలను అరెస్ట్ చేశారు.