జగన్ చౌకబారు, హుందా చూపాలి: రావెల, మేడా
కడప: బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వైఎస్సార్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హుందాగా వ్యవహరించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి ఆర్ కిషోర్బాబు, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం ప్రభుత్వ పాలనపై చౌకబారు ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. ఇద్దరూ కలిసి గురువారం కడప, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో పర్యిటించారు.
చంద్రబాబు పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరుఫున పోరాటం చేశారని వారు గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా వ్యవహరించి టిడిపిని తిరిగి అధికారంలోకి తెచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాలేదని, ఇంతలోనే ప్రభుత్వంపై విమర్శలకు దిగడం జగన్ బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతోందన్నారు.

కాంగ్రెస్ హయాంలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో రాష్ట్రంలో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. వీటన్నింటిపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించడం ఖాయమని హెచ్చరించారు. పదేళ్ల పాలనలో పలువురు టిడిపి నేతలు, కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న తల్లి, పిల్ల కాంగ్రెస్ నేతలు ముఖ్యంగా జగన్, టిడిపి హత్యా రాజకీయాలు చేస్తోందని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
చిచ్చు పెట్టడం, రాజకీయ హత్యలు చేయించడం, భయానక వాతావరణం సృష్టించడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన వల్లే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్ర విభజనకు బీజం వేసి దాని వల్ల జరిగిన అనర్థాలతో సతమతమవుతున్న తరుణంలో బాధ్యత మరిచి మాట్లాడడం దారుణమన్నారు.
విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఎదురైన ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి కొత్తరాజధాని ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే జగన్ చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, ఆయన ధోరణి మారకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications