నేనే పవర్ఫుల్: రావెల సంచలనం, బిజెపిపైనా
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తానే పవర్ఫుల్ మినిస్టర్నని, తన ఆధీనంలో 31 శాఖలున్నాయని, ఏ పనైనా నిమిషాల్లో చేయిస్తానని, ఇతర మంత్రులు కాదన్నా నేరుగా నిధులిచ్చే అధికారం తనకు ఉందని, ఇంత పవర్ఫుల్ మినిస్ట్రీ దొరకడం తన అదృష్టమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్ బాబు సంచలన ప్రకటన చేశారు. బిజెపితో పొత్తుపై కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సోమవారం గుంటూరు జిల్లా గనికపూడిలో ‘జన్మభూమి-మా ఊరు'లో ఆయన మాట్లాడారు. ‘‘సాంఘిక సంక్షేమమంటే ఏదో హాస్టళ్లు చూడడం అనుకుంటున్నారేమో.. ఆరువేల కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధులున్నాయి. రెండు వేల కోట్లు నావద్ద ఉంచుకుని సీఎం అనుమతితో 4వేలకోట్లు అన్ని శాఖలకు ఇచ్చాను. వారు ఖర్చుపెట్టే ప్రతి రూపాయిపైనా నాకు జవాబివ్వాలి. చిన్న పనులపై అంచనాలతో నా వద్దకు రండి. వెంటనే శాంక్షన్ చేయిస్తా.. అది నాకు ఐదు నిమిషాల పని'' అని సూచించారు.
మంత్రులందరిలో సమర్థుడిగా గుర్తించినందువల్లే ముఖ్యమంత్రి తనను కడప జిల్లా ఇన్చార్జిగానే కాకుండా అన్ని కమిటీలలో బాధ్యతలు ఇచ్చారన్నారు. అన్ని జిల్లాల్లో తిరగాలి కాబట్టి భార్యాబిడ్డలను కూడా కలుసుకునే తీరికలేదన్నారు.
సభలో పంచాయతీ కార్యదర్శిపై ప్రజలు ఫిర్యాదు చేయడంతో మంత్రి మండిపడుతూ, రేపట్నుంచి రావద్దంటూ ఆదేశించారు. అయితే, ఆ ఊపులో ‘‘గంజాయివనంలో ఓ కలుపు మొక్కను పీకేశా. అవసరమైతే ఇంకా ఏరేస్తా' అంటూ మాట్లాడారు. ‘తులసివనంలో గంజాయి మొక్కలు' అనటానికి బదులు మంత్రి అలా అనడం కార్యకర్తలను కలవరపరచింది.
బిజెపితో పొత్తుపై తెలుగుదేశం పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని మంత్రి అన్నారు. ప్రత్తిపాడులో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీతో ఎంత వరకు మిత్రపక్షంగా కొనసాగాలన్నది ఆలోచించాల్సి ఉందన్నారు. ఇటీవల బీజేపీలోకి పలువురు వలస పోవడంపై మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నకు ఆయన ఇలా స్పందించారు.
రాష్ట్రాభివృద్ధి, ప్రాజెక్టులు, కేంద్రం సాయం కోసమే బీజేపీతో జత కట్టామన్నారు. పార్టీ సిద్ధాంతాలపై రాజీపడేది లేదన్నారు. కాగా, రాజధాని కోసం భూ సేకరణపై జమ్ముల శ్యాం కిషోర్లాంటి బీజేపీ చోటా నేతలకు సమాధానం చెప్పనని, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, హరిబాబు లాంటి స్థాయిగల వారు మాట్లాడితేనే స్పందిస్తానని మరో ప్రశ్నకు జవాబిచ్చారు.