'దుబాయ్ శీను' సినిమాలో మాదిరిగా దోచేసి భార్యతో పరారీ
విజయవాడ: అచ్చం దుబాయ్ శీను సినిమాలో మాదిరిగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన సంఘటన విజయవాడలో జరిగింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ పేద, మధ్య తరహా కుటుంబాలకు చెందిన సుమారు 82 మందిని నమ్మబలికి పోలీసులకు చిక్కాడు.అందరి దగ్గరూ రెండు మూడు లక్షల చొప్పున భారీగా డబ్బులు వసూలు చేశాడు. ఇజ్రాయెల్ వెళ్లడానికి అందరినీ ముంబై వచ్చేయమన్నాడు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత అతను కనిపించలేదు.
జరిగిన మోసాన్ని గుర్తించిన వారు అష్టకష్టాలు పడి చివరకు విజయవాడ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిరెడ్డి అనే వ్యక్తి ఏజెంటుగా వచ్చాడు. అతడు ఎక్కడుంటాడో కూడాఏం చేస్తాడో కూడా ఎవరికీ తెలియదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రవిరెడ్డి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి వచ్చాడు.

తన ఖరీదైన కారుకోసం డ్రైవర్గా స్థానిక యువకుడైన గంగాధర్ను నియమించుకున్నాడు. తాను కొన్ని క్రైస్తవ ట్రస్ట్ల తరఫున వచ్చానని, ఆ ట్రస్ట్లకు ఇజ్రాయెల్లో పలు కంపెనీలు ఉన్నాయని ప్రచారం చేసుకున్నాడు.
అంతేకాక విదేశాల్లోని పలు కంపెనీలతో తనకు సంబంధాలున్నాయని, అక్కడ తాను ఉద్యోగాలిప్పిస్తానని కూడా ప్రచారం చేయడంతో చాలామంది యువకులు ఆకర్షితులయ్యారు.
మొదట శ్రీరామ్ అనే యువకుడి వద్ద నుంచి రూ. రెండు లక్షలు తీసుకున్నాడు. మరి కొంతమందిని కూడా తీసుకువస్తే ప్రతి మనిషికి 20 శాతం కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీంతో ఒకరి తర్వాత ఒకరు రవిరెడ్డి ఉచ్చులో పడ్డారు.
ఇజ్రాయెల్ వెళ్లేందుకు నగదు చెల్లించిన దివ్య అనే మహిళను రవిరెడ్డి ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. గతంలో గల్ఫ్ ఏజెంట్లుగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఉండికి చెందిన సత్తార్ బీబీ, మున్నీసాలను తనవైపు తిప్పుకుని, వారి కుటుంబ సభ్యులతో సహా మొత్తం 43 మంది వద్ద డబ్బు కట్టించుకున్నాడు. రవిరెడ్డిపై గురి కుదరడంతో సుమారు 82 మంది ఎటువంటి ఆధారాలు లేకుండా అతడికి నగదు చెల్లించేశారు. సుమారు రూ 1.5 కోట్ల వరకు అతడు వసూలు చేశాడు.
తనకు డబ్బు కట్టినవారినందరినీ ఇజ్రాయెల్ పంపుతానని, జూలై 1న ముంబైనుంచి విమానం బయలుదేరుతుందని చెప్పాడు. దీంతో జూన్ 30 నాటికి అందరూ ముంబై చేరుకున్నారు. అయితే రవిరెడ్డి ఆచూకీ లేకపోవడం, అతడు వాడిన నాలుగు ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో తామంతా మోసపోయినట్లు గుర్తించారు. అతడు తన భార్యతో కలిసి ఉడాయించాడని గుర్తించారు.
దాంతో ఆదివారం రాత్రికి విజయవాడ చేరుకున్నారు. అయితే తన ద్వారా వచ్చిన 35 మందికి డబ్బులు తిరిగి చెల్లించేస్తానని సత్తార్బీబీ చెప్పడంతో వారంతా వారి గ్రామాలకు వెళ్లిపోయారు. మిగిలిన వారు మాత్రం తమకు న్యాయం చేయాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావును ఆశ్రయించారు.












Click it and Unblock the Notifications