చంద్రబాబుకు రాయలసీమ చిచ్చు: జగన్ మద్దతు ఉందా?
విజయవాడ: ప్రత్యేక రాయలసీమ చిచ్చు రగులుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 21వ తేదీన రాయలసీమ నేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి లభించే ప్రతిస్పందనను బట్టి ఉద్యమ తీవ్రతను అంచనా వేయవచ్చునని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారే సూచనలున్నాయని అంటున్నారు.
రాయలసీమకు అన్యాయం జరుగుతుందనే వాదనకు క్రమంగా బలం చేకూరుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాయలసీమ కోసం జరిగే సమావేశానికి వెళ్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తాజాగా అనంత వెంకటరామిరెడ్డి కూడా అన్నారు.

ప్రత్యేక రాయలసీమ వాదనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఉందనే మాట వినిపిస్తోంది. ప్రాంతాల మధ్య వైయస్ జగన్ చిచ్చుపెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికే విమర్శల దాడికి పూనుకున్నారు.
తాజాగా సోమవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తాను రాయలసీమ బిడ్డనే అని, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాయలసీమకు అన్యాయం జరగనివ్వనని ఆయన అన్నారు. తద్వారా రాయలసీమ చిచ్చుకు ఆయన చెక్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
అయితే, తెలుగుదేశం పార్టీకి చెందిన రాయలసీమ నేతల నుంచి ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి మద్దతు లభించే అవకాశాలు లేవని అంటున్నారు. పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రకటన ఈ విషయాన్ని పట్టిస్తోంది.












Click it and Unblock the Notifications