రాష్ట్రపతిని రబ్బర్ స్టాంప్ చేశారు: టిపై రాయపాటి వ్యాఖ్య
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని రబ్బర్ స్టాంప్లా మార్చేసిందని కాంగ్రెసు బహిష్కృత పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లుపై ఎన్ని అభ్యంతరాలున్నా వాటిని ఎంతమాత్రం లెక్కచేయకుండా ఒంటెద్దు పోకడతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతోందని ఆయన బుధవారం సాయంత్రం విమర్శించారు.
చిట్టచివరకి రాష్ట్రపతిపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి రాష్ట్రపతి రబ్బర్ స్టాంప్ అన్నట్లు మార్చేసిందని రాయపాటి సాంబశివరావు అన్నారు. తాము ఎంతగానో చెప్పి చూశామనీ, తమ మాటలన్నిటినీ తోసిపారేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ పార్టీవారిని కాదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 14 లోకసభ సీట్లలో గెలుస్తుందన్న నమ్మకంతో ఆ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎలా చెబితే అలా తలాడిస్తున్నారనీ, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ముప్పయి ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాననీ, గత పదేళ్లలో సోనియా గాంధీ పార్టీని నమ్ముకున్నవారి పట్ల వింతగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఈ దశలో తామేమీ చేయలేమనీ, ప్రజల కోసం పోరాటం చేయడం తప్పించి తమ ముందు ఎలాంటి ఎజెండాలు లేవని అన్నారు. తాము పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, విభజనను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని రాయపాటి అన్నారు.