ఊపు మీద జనసేనాని... ప్రీతి సుగాలి తర్వాత పవన్ టేకప్ చేయబోయే కేసు ఇదే..
కర్నూలుకు చెందిన పదో తరగతి విద్యార్ధిని ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన పోరాటం సఫలం కావడంతో ఇప్పుడు అదే బాటలో మండపేట విద్యార్ధిని కేసులోనూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రీతి సుగాలి కేసును సీబీఐకి అప్పగించేలా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయడంలో సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు మండపేట అత్యాచార బాధితురాలికి న్యాయం చేసేలా ఏం చేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది.
పవన్ పోరాటం తర్వాత ప్రీతి కేసు సీబీఐకి..
2017లో కర్నూలులోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో పదో తరగతి చదువుతున్న ప్రీతి సుగాలి హాస్టల్లో ఉరేసుకుని చనిపోయింది. తమ కూతురు ఆత్మహత్య చేసుకోలేదని, స్కూలు యాజమాన్యం అత్యాచారం చేసి హత్య చేసిందని తల్లితండ్రులు ఆరోపించారు. పోస్టుమార్టం నివేదికలోనూ పలు పొంతన లేని విషయాలు వెలుగుచూశాయి. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రీతి తల్లితండ్రులు పోరాటం చేస్తున్నారు. చివరికి జనసేన అధినేత పవన్ రంగంలోకి దిగారు. ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ కర్నూల్లో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. దీంతో సీఎం జగన్ ప్రీతి కేసును ఎట్టకేలకు సీబీఐకి అప్పగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ప్రీతి బాటలోనే మండపేట విద్యార్ధిని కేసు..
ప్రీతి సుగాలి అత్యాచారం, హత్య కేసులో సాక్ష్యాల తారుమారు, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత ధోరణి కారణంగా కేసు సీబీఐకి చేరింది. ఈ విషయంలో ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేసి కేసును సీబీఐకి అప్పగించేలా ఒత్తిడి తెచ్చిన పవన్. ఇప్పుడు తాజాగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో డిగ్రీ చదువుతున్న దళిత విద్యార్ధినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనపైనా పోరాడాలని నిర్ణయించారు. దిశ చట్టం అమల్లోకి వచ్చినా నిందితులపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోవడాన్ని ప్రశ్నిస్తున్న పవన్.. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోరుకు సిద్ధమవుతున్నారు. త్వరలో బాధితురాలి కుటుంబాన్ని సందర్శించి నిజానిజాలు తెలుసుకోవాలని పవన్ భావిస్తున్నారు.
మండపేట కేసుపై పవన్ ఆసక్తి వెనుక..
తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. జనాభాలో కాపులు కూడా ఎక్కువగానే ఉన్నప్పటికీ ఇక్కడ పెత్తనం అంతా కమ్మ సామాజికవర్గానిదే. మండపేటలో ప్రస్తుతం టీడీపీ తరఫున వేగుళ్ల జోగేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. పక్కనే ఉన్న రామచంద్రపురంతో పాటు కొత్తపేటలోనూ వైసీపీ ఎమ్మెల్యేలు చెల్లుబోయిన వేణు, చిర్ల జగ్గిరెడ్డి ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ కాపు జనాభా అధికంగానే ఉన్నా వారు గత ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకే జై కొట్టారు. దీంతో ఇక్కడ పట్టు కోసం పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Recommended Video
మండపేట పోరుతో కోనసీమలో పట్టు..
మండపేటలో అత్యాచార ఘటనపై పవన్ చేసే పోరాటం వెనుక కోనసీమలో జనసేన పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కోనసీమలోని రాజోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజోలుతో పాటు చుట్టు కోనసీమలోని ఇతర నియోజకవర్గాల్లోనూ కాపులతో పాటు ఎస్సీ జనాభా ఎక్కువ. ప్రస్తుతం మండపేటలో సామూహిక అత్యాచారానికి గురైన విద్యార్దిని కూడా దళిత వర్గమే. దీంతో కాపులు ప్లస్ దళితులను ఆకట్టుకునేందుకు మండపేట అత్యాచార ఘటనపై పోరాడాలని జనసేన నిర్ణయించుకున్నట్లుగా అర్ధమవుతోంది.