Raghurama Raju లేఖాస్త్రం: మీ నిర్ణయం ముల్లులా మారింది : వైఎస్ నిర్ణయానికి విరుద్దంగా..అనర్హత..!!
ముఖ్యమంత్రి జగన్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ తన లేఖలను కొనసాగిస్తున్నారు. రోజుకో అంశం పైన లేఖ రాస్తున్న రఘురామ ఈ సారి ఏపీలో ఆంగ్ల బోధన గురించి లేఖ రాసారు. అందులో కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగును తొక్కేయాలని తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయంగానో..మరే కారణంతోనూ వ్యతిరేకించటం లేదని..రాజ్యంగ విరుద్దమనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనే మీ నిర్ణయం ప్రతీ తెలుగు వాడి గుండెల్లో ముల్లులా గుచ్చుకుంటోందని పేర్కొన్నారు.
మీరు చెబుతున్న ఆంగ్ల బోధన కోసం పాఠశాలల్లో అవసరం మేర యంత్రాంగం సిద్దంగా ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగును పెడుతున్నట్లుగా కూడా ఎక్కడా పేర్కొనలేదని రాసుకొచ్చారు. ఇప్పటికైనా తెలుగు బాష ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని సూచించారు. మాతృభాష నుండి పసి మనసులను దూరం చేయద్దని కోరారు. ఇప్పటికైనా తెలుగు భాషను చిదిమేయాలనే మంకుపట్టుతో వేసిన.. వ్యాజ్యాలను ఉపసంహరించుకోవాలని రఘురామ కోరారు.
జాతీయ విద్యా విధానాన్ని తూచా తప్పకుండా అనుసరించి.. మీ గౌరవం, రాష్ట్ర గౌరవాన్ని పెంచాలని రఘురామ అభ్యర్ధించారు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన చట్టం గురించి లేఖలో ప్రస్తావించారు. ఆ చట్టం గురించి తెలుసుకున్నా తెలుగు భాషను అంతం చేయాలని అనుకోరని వ్యాఖ్యానించారు. తెలుగు సరిగా నేర్చుకోకపోవటం..తెలుగులో స్పష్టంగా మాట్లాడలేకపోవటం..తెలుగు భాషను అవమానించటమే కాదు.. మన కన్నతల్లిని అవమానించటమే నంటూ లేఖలో పేర్కొన్నారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన మీరు అధికారంలోకి వచ్చిన తరువాత అయినా తెలుగు గురించి తెలుసుకొని ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్నితాను పార్లమెంట్ లో ప్రజాస్వామ్యయుతంగా ప్రస్తావించానని గుర్తు చేసారు. దీనికి ఫలితంగా తన మీద ఆగ్రహం వ్యక్తం చేసి తనను పార్టీ వ్యతిరేక కార్యకలాపా లకు పాల్పడినట్లుగా చెబుతూ అనర్హుడిగా ప్రకటించేందుకు ప్రయత్నించారని రఘురామ తన లేఖలో వివరించారు.