అమరావతి రైతులకు వార్షిక కౌలు తక్షణమే విడుదల చేయండి.! సిఆర్డిఏ కమిషనర్ కు నారా లోకేష్ లేఖ.!
అమరావతి/హైదరాబాద్: అమరావతి రాజధాని నిర్మాణం కోసం చేపట్టిన భూ సమీకరణకు రైతులు తమ భూమిని త్యాగం చేశారని, రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి సాగు సామర్థ్యం ఆధారంగా వారికి 30వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ కౌలు చట్టపరంగా ఇవ్వాల్సి ఉందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ సిఆర్డిఏ కమిషనర్ కు రాసిన లేఖలో తెలిపారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం కోసం పూర్వికుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములను ఈ రైతులు త్యాగం చేశారనే విషయం ప్రభుత్వం మరవకూడదని, ప్రతి ఏటా మే నెలలో వీరికి కౌలు చెల్లించాలనే విషయం సీఆర్డీఎ కమీషనర్ కు తెలియంది కాదని లోకేష్ అన్నారు. కరోనా మొదటి దశలో గత ఏడాది కౌలు చెల్లింపు నెలరోజులకు పైగా ఆలస్యం చేయటం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, కరోనా రెండో దశలో ఈ ఏడాది కూడా కౌలు ఇంత వరకూ కౌలు చెల్లించకపోవటం సరికాదని అన్నారు. భూమిని త్యాగం చేసిన అధిక శాతం రైతుల్లో హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్న చిన్నకారు రైతులేనని, వారంతా ఈ వార్షిక కౌలు పైనే ఆధారపడి ఉన్నారని కమీషనర్ కు రాసిన లేఖలో లోకేష్ పేర్కొన్నారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ తీవ్ర ప్రభావం చూపుతున్నందున రైతులకు వార్షిక కౌలు వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువకు వెళ్లటానికి ముఖ్య కారణం సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవటమేనని అన్నారు. అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం తాజా నివేదిక ప్రకారం కరోనా కారణంగా దేశంలో 23కోట్ల మంది భారతీయులు పేదలుగా మారారని, కరోనా సోకిన రైతు కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేసారు. 2014డిసెంబర్ నాటికి అమరావతి ప్రాంతంలో నివసించే వారందరికీ ఉచిత వైద్యసేవలు అందించేందుకు నాటి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుందని, ఇందుకనుగుణంగా ఆరోగ్య కార్డులూ జారీ చేసిందని, ఈ కార్డుల ఆధారంగా అనేక ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందించేందుకు ఇప్పుడు నిరాకరించడం దారుణమన్నారు లోకేష్.












Click it and Unblock the Notifications