లంచమిస్తూ పట్టుబడిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి: అరెస్టు
హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తెలంగాణ తెలుగుదేశం శాసనసభ్యుడు, నేత రేవంత్రెడ్డి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు లంచమిస్తుండగా అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు పట్టుకున్నారు. నామినేటెడ్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ను ప్రలోభ పెట్టేందుకు రేవంత్ ప్రయత్నించారు.
రూ. 5 కోట్ల డబ్బు ఇవ్వడానికి బేరసారాలు అడి స్టీఫెన్ సన్ ఇంటికి రేవంత్ వెళ్లారు. అయితే పక్కా సమాచారంతో రేవంత్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉండదని రేవంత్ మాట్లాడిన విషయం విదితమే.

స్టీఫెన్ కుమారుడి నివాసంలో రూ. 50 లక్షల రూపాయల ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఎసిబి అధికారుల కస్టడీలో ఉన్నారు. తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీ పదవి కోసం ఎమ్మెల్యేలో కోటాలో వేం నరేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు.
సికింద్రాబాద్ ప్రాంతంలో రేవంత్ని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. రేవంత్ ప్రలోభ పెడుతున్నారని శనివారంనాడు ఏసీబీకి స్టీఫెన్ సన్ ఫిర్యాదు చేశారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. పక్కా సమాచారంతో మాటువేసి ఏసీబీ అధికారులు రేవంత్ను పట్టుకున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అయితే పోలీసులు రేవంత్ ఫోన్ సంభాషణలు, ఇతరత్రా వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి అరెస్టు వార్తలపై తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి స్పందించారు. అరెస్టుపై పూర్తి వివరాలు అందిన తర్వాత మాట్లాడుతానని ఆయన చెప్పారు. కాగా, రేవంత్ రెడ్డిపై కుట్ర చేశారని తెలంగాణ తెలుగుదేశం నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డిని వెంటనే సరెండర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
డిఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఎసిబి అధికారులు రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. తన వద్ద ఎటువంటి డబ్బు దొరకలేదని రేవంత్ రెడ్డి మీడియాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే, స్టీఫెన్ సన్కు, రేవంత్ రెడ్డికి మధ్య జరుగుతున్న సెల్ ఫోన్ సంభాషణలను ఎసిబి అధికారులు రికార్డు చేసినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వద్ద ఎటువంటి డబ్బులూ దొరకలేదని టిడిపి నాయకులు అంటున్నారు.
రేవంత్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో తెలుగుదేశం నాయకులు డిజిపి అనురాగ్ శర్మను కలిశారు. కావాలనే రేవంత్ రెడ్డిని ఇరికించారని వారు డిజిపికి ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం పార్టీ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్ సన్ ఇంటికి ఎందుకు వెళ్లాడో తెలుగుదేశం నాయకులు చెప్పాలని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అడిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిది నీచమైన చరిత్ర అని ఆయన అన్నారు. అక్కడ విచారణ జరుగుతుంటే ఓ వర్గం మీడియా తీవ్రమైన ఉత్సుకత ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు.
ఏం జరిగిందో వ్యవహారాలు చూస్తున్నవాళ్లు చూస్తారు కదా అని ఆయన అన్నారు. మీకంటే ఎక్కువ వివరాలు నాకు తెలియదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తనకు కూడా ఎమ్మెల్యేలు ఫోన్ చేశారని ఎర్రబెల్లి దయాకర్ రావు చెబుతున్నారని, ఎర్రబెల్లి కన్నా దొంగ ఎవరన్నా ఉన్నారా అని ఆయన అన్నారు. ఇద్దరు ముగ్గురు మీడియా ప్రతినిధులు ఏమేమో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.
తమ క్యాంపులోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మొదట అన్నాారని, ఇప్పుడేమో బుకాయింపులు చేస్తున్నారని ఆయన అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, చంద్రబాబు ఎలా పనిచేస్తారో తనకు తెలుసునని, చంద్రబాబు జవాబు చెప్పాల్సి వస్తుందని తలసాని అన్నారు.












Click it and Unblock the Notifications