కెసిఆర్ను ఏకేసిన రేవంత్: బాబు వైఖరిపై భగ్గుమన్న ఎమ్మార్పీయస్
నిజామాబాద్: తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకుడు రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ధ్వజమెత్తారు. రంగు బయటపడుతుందనే తనకు శాసనసభలో మైక్ ఇవ్వలేదని ఆయన కేసిఆర్ను విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలను ముట్టుకుంటే కరెంట్ తీగెలను అంటుకున్నట్లేనని ఆయన శనివారం అన్నారు.
మహిళలకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం కెసిఆర్ నైజాన్ని బయటపెట్టిందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ప్రాణత్యాగాలు చేసుకుంటే అమర వీరుల స్థూపం ఏర్పాటు చేసే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయిందని ఆయన తప్పు పట్టారు. నిజామాబాద్లో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాదులోని గన్పార్కులో ఉన్న అమరవీరుల స్థూపాన్ని అధికారికంగా ప్రారంభించలేదని ఆయన చెప్పారు. హుస్సేన్సాగర్లోని బుద్ధుడి విగ్రహం కన్నా ఎత్తులో అమరవీరుల స్థూపాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

ఇదిలావుంటే, నిజామాబాద్ జిల్లాలో టీడీపీ సర్వసభ్య సమావేశాన్ని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు వైఖరిని నిరిసిస్తూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఈ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టకపోవడంతో వారు నిరసన దిగారు.
దీంతో టీడీపీ కార్యకర్తలు వారిని ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్దేశపూర్వకంగా సమావేశాన్ని అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ కార్యక్రమానికి టీటీడీపీ నేతలు ఎల్రమణ, ఎర్రబెల్లి, రేవంత్రెడ్డి, మండవ వెంకటేశ్వర రావు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications