జగన్, కెసిఆర్పై రేవంత్ నిప్పులు: నన్నపనేని క్షమాపణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి గురువారం మండిపడ్డారు. ఎన్నికల సర్వే సంస్థలపై కేంద్ర, రాష్ట్రాలు దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేశారు.
మోసపూరిత సర్వేలు నిర్వహించి వారిని సాంఘిక బహిష్కరణ చేయాలని వ్యాఖ్యానించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అక్రమ సంపాదనతో సర్వే సంస్థలకు ఉన్న విశ్వసనీయతను దెబ్బతీస్తోందన్నారు. కెసిఆర్ తెరాసను విలీనం చేస్తే దళితుడిని సిఎం చేయాలని షరతు పెట్టాలన్నారు. దానికి కాంగ్రెసు పార్టీని ఒప్పించాలన్నారు.

కెసిఆరే సిఎం కావాలని కోరుకుంటే తెలంగాణ సమాజం ఆయనను వెలివేస్తుందన్నారు. తాము స్వయంపాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నాం తప్ప.. సోనియా పాలన కోసం కాదన్నారు. కెసిఆర్ తన మేనిఫెస్టోలో దళితులకు సిఎం పదవి, ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని పొందుపర్చాలన్నారు. తాము సమన్యాయం కోరితే రెండు ప్రాంతాలకు అన్యాయం చేశారన్నారు.
క్షమించండి: నన్నపనేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేసిన పోరాటంలో టిడిపి ఓటమిపాలైందని, అందుకు సీమాంధ్ర ప్రజలు క్షమించాలని ఆ పార్టీ శాసన మండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అత్యున్నత న్యాయస్థానంలో పోరాటం సాగిస్తామన్నారు.
అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ఆమోదించి దుస్సాంప్రదాయన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతల్లో ఐక్యత లేదన్నారు. అందుకే విభజనను చట్టసభల్లో అడ్డుకోలేకపోయామన్నారు. విభజన చేసి సీమాంధ్రులను సముద్రంలో పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
విలీనం చేయాలి: విహెచ్
కెసిఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని కాంగ్రెస్ ఎంపి వి హనుమంత రావు డిమాండ్ చేశారు. వరంగల్లో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి బిసిని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. సీమాంధ్రులు లేకపోతే హైదరాబాదు రోడ్లు ఎడారుల్లా మారుతాయని కిరణ్ కుమార్ రెడ్డి అనడం అవివేకమన్న విహెచ్, నాలుగున్నర కోట్ల మందితో హైదరాబాదు నిండుగా ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications