హరీష్ని సీఎం చేస్తే, బాబు రాక్షసుడు!: రేవంత్, జగన్పై..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసలు పాలనే లేదని, భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు పగ్గాలు ఇస్తే చక్కటి పాలన అందించగలరని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మంగళవారం అన్నారు. అసెంబ్లీ లాబీల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఆయన మాట్లాడారు. వలసల పైన కాకుండా పాలన పైన తెరాస దృష్టి సారించాలన్నారు.
తమ పూర్వీకులు బీహార్ వారని గతంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చెప్పారన్నారు. ఐఏఎస్ల కేటాయింపుల పైన కేంద్రానికి నిరసన ఎందుకు తెలపలేదని రేవంత్ తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హరీష్ రావు సీఎం అయితే రాష్ట్రంలో పాలన మెరుగు పడుతుందేమో అన్నారు. హరీష్రావు మాస్ నాయకుడన్నారు.
హరీష్ ప్రజల్లో విశ్వాసం పొందిన నాయకుడని, ప్రజల్లోకి వెళ్లి పనిచేయగలిగిన నాయకుడన్నారు. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర పాలన బాగుందని మీడియా ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ రాష్ట్ర పాలన ఇంకా ప్రారంభం కాలేదని కేసీఆరే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక్కడ ఏ పనులు జరగడం లేదన్నారు.
కానీ పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు తెల్లవారిన దగ్గర నుంచి రాక్షసుడిలా 24 గంటలూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితులు లేవని, ప్రజల్లో విశ్వాసం కల్పించాలంటే నాయకత్వం మార్పు కావాలన్నారు.
జానారెడ్డిపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జానారెడ్ది తెలివతక్కువవారని అనుకోవడం మన మూర్కత్వమన్నారు. జానా చాలా తెలివైనవారని అర్థమయ్యేలా మాట్లాడాలనుకంటే అర్థమయ్యేలా మాట్లాడతారని, అర్థం కాకుండా మాట్లాడాలంటే ఆ విధంగా మాట్లాడగలరని, సమర్థవంతమైన నాయకుడని, ఈ రోజు అసెంబ్లీలో చాలా తెలివిగా మాట్లాడారన్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పనులు అన్నీ కూడా గతంలో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన రాజీవ్ యువ కిరణాల పథకం లాంటివే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చెపుతున్నవి ఆచరణ సాధ్యం కావన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా విద్యుత్కు సంబంధించి ఒక సలహా ఇచ్చారని గుర్తు చేశారు.
కేంద్రానికి వెళుతున్న విద్యుత్ను ఇక్కడ వినియోగించుకుని, ఛత్తీస్గడ్తో కుదుర్చుకున్న కరెంట్ కేంద్రానికి ఇస్తే సరిపోతుందని ఇచ్చిన సలహా ఆచరణసాధ్యం కాదన్నారు. పాలన పైన దృష్టి పెడితే ప్రజల సమస్యలు కొంతవరకు తీరుతాయన్నారు. ప్రజల్లో విశ్వాసం కల్పించాలని, లేదంటే ప్రజల్లో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.
గిరిజన ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమావేశం
గిరిజన ఎమ్మెల్యేలతో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతు రుణాల మాఫీకి కేసీఆర్ అంగీకరించారు. రుణమాఫీ వర్తింపు పైన నివేదిక ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.
తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీ
తెలంగాణ అసెంబ్లీ రూల్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో అధికార పార్టీ నుండి హరీష్ రావు, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుండి జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీడీపీ నుండి వివేకానంద, మజ్లిస్ నుండి అక్బరుద్దీన్, బీజేపీ నుండి డాక్టర్ కే లక్ష్మణ్, వైసీపీ నుండి తాటి వెంకటేశ్వర్లు, సీపీఐ నుండి సున్నం రాజయ్య, సీపీఐ నుండి రవీంద్ర నాయక్ ఉన్నారు. చైర్మన్గా స్పీకర్ మధుసూదనాచారి ఉంటారు. కాగా, శాసన సభ, మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.