హెడ్ఫోన్ విసిరేసి, పోడియంవైపు: ఊగిపోయిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గురువారం తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్వేగానికి గురై, ఊగిపోయారు. తనకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని పదే పదే కోరిన తన విన్నపాన్ని స్పీకర్ మధుసూదనాచారి పెడచెవిన పెట్టారనే ఆరోపణతో ఆయన తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకానొక దశలో ఆగ్రహంతో ఊగిపోతూ హెడ్ ఫోన్ విసిరేసి పోడియం వైపు దూసుకెళ్లారు.
జీరో అవర్లో టీడీపీ నేత రేవంత్రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) సభ్యులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే మాట్లాడాలని నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి పోడియం వైపు దూసుకెళ్లిన సమయంలో స్పీకర్ మధ్యాహ్న భోజనం కోసం సభను వాయిదా వేశారు.
టిడిపి ఎమ్మెల్యేలకు విప్ జారీ
తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ అయింది. రేపు(శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస యాదవ్, తీగల కృష్ణా రెడ్డి, ధర్మారెడ్డిలకు టీడీపీ విప్జారీ చేసింది.
పాలెం బస్సు దుర్ఘటనపై...
పాలెం బస్సు దుర్ఘటన జరిగి ఏడాది గడుస్తున్నా మృతుల కుటుంబాలకు న్యాయం జరగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో మాట్లాడుతూ కొత్త ప్రభుత్వమైనా నిందితులపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. పాలెం వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు పనులు చేసిన ఎల్అండ్టీ సంస్థపైనా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి అన్నారు.