ఖమ్మంలో టిడిపి, జగన్పార్టీ కాంట్రాక్టర్లతో నారాయణ ఢీ
ఖమ్మం: కమ్యూనిస్టుల కోట అయిన ఖమ్మం జిల్లాలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. ఖమ్మం లోకసభ బరిలో ఇద్దరు బడా కాంట్రాక్టర్లతో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తలపడుతున్నారు. టిడిపి తరఫున నామా నాగేశ్వర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు బరిలో ఉన్నారు. సిపిఐ నారాయణకు కాంగ్రెసు పార్టీ మద్దతిస్తోంది. తెరాస అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ.. ఆ పార్టీ నామమాత్రంగానే ఉంది.
ఖమ్మం లోకసభలో ఇప్పటి వరకు వలస అభ్యర్థులే ఎక్కువసార్లు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాత్రం టిడిపి, వామపక్షాలు, తెరాస పొత్తులో భాగంగా మహా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగిన నామా నాగేశ్వర రావు కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1.24 భారీ విజయం సాధించారు. ఖమ్మం నియోజకవర్గంలో ఈసారి పొత్తులు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. సమైక్యవాదానికి జై కొట్టిన జగన్ పార్టీతో సిపిఎం ఇక్కడ పొత్తు పెట్టుకుంది.
తెరాస మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఖమ్మం ఎంపీ నియోజకవర్గ ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో రెండుచోట్ల సిపిఐ, ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏడు స్థానాల్లోనూ టిడిపి అభ్యర్థులను నిలబెడితే, సిపిఎం రెండుచోట్ల, జగన్ పార్టీ ఐదు చోట్ల తమ అభ్యర్థులను పోటీలో ఉంచాయి. ఎర్రకోట అయిన ఖమ్మంలో టిడిపికి కూడా బలం ఉంది. కాంగ్రెసు, సిపిఐ పొత్తు పెట్టుకున్నందున టిడిపికి గట్టి పోటీనిస్తోంది. ఇక జగన్ పార్టీ, సిపిఎం కలవడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
నారాయణకు కాంగ్రెస్లోని అసంతృప్తులు సవాలుగా మారారు. కొత్తగూడెం సీటును సిపిఐకి కేటాయించడంతో ఇక్కడి కాంగ్రెస్లో అసంతృప్తి భగ్గుమంది. డిసిసి అధ్యక్షుడు వనమా వెంకటేశ్వర రావు పార్టీకి గుడ్బై చెప్పేసి జగన్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, సిపిఐ ఓటు బ్యాంకు కలిస్తే టిడిపి, జగన్ పార్టీలకు కొంత ఇబ్బందే. నారాయణకు కాంగ్రెస్ పక్షాన రేణుకా చౌదరి, రాంరెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క, పువ్వాడ అజయ్ కుమార్ అండగా ఉన్నారు.
టిడిపి, జగన్ పార్టీ అభ్యర్థులు బడా కాంట్రాక్టర్లు కావడంతో ఖర్చు విషయంలో వారితో నారాయణ పోటీ పడలేని పరిస్థితి. నియోజకవర్గ పరిధిలో కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు నారాయణకు ఎంత మేరకు మొగ్గు చూపుతాయనేది ప్రధాన ప్రశ్న. జిల్లాలో నామాకు మంచి పట్టు ఉంది. అయితే, టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి ఉనికి ఇక్కడ నామమాత్రమే. పార్టీలోని అసమ్మతులు ఆయనకు సవాలే. నామా, తుమ్మల మధ్య తారస్థాయిలో విభేదాలున్నాయి.
బిసిలకు టికెట్లు రాకుండా నామా అడ్డుకున్నారని తుమ్మల వర్గం గుర్రుగా ఉంది. టికెట్ దక్కని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ కూడా ప్రచారానికి దూరంగా ఉంటానిన ప్రకటించినా.. బాబు పిలిచి మాట్లాడడంతో ఆయన మెత్తబడ్డారు. ఇలా గ్రూపు విభేదాలను అధిగమించి అందరినీ కలుపుకొంటే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. సమైక్యవాద పార్టీగా ముద్రపడిన జగన్ పార్టీ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
అసెంబ్లీ నియోజక వర్గాల్లో వ్యూహాత్మకంగా రెండుచోట్ల జగన్ పార్టీ బిసి అభ్యర్థులను బరిలో పెట్టింది. ఇది ఆ పార్టీకి కొంత బలం చేకూరుస్తోంది. సిపిఐ అభ్యర్థిగా నారాయణ బరిలో ఉండడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఓట్లు తమకు పడతాయని జగన్ పార్టీ ఆశలు పెట్టుకుంది.