నా బిడ్డపై కుట్ర: అనీషా తండ్రి, డైరీ రిషికేశ్వరే రాసిందా, జితేందర్తో చాటింగ్, కొత్త ట్విస్ట్లు
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో తన కూతురు అనీషాను ఇరికించారని ఆమె తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాగింగ్తో ముడివడి ఉన్న ఈ కేసులో తన కుమార్తెను కావాలనే ఇరికించారని, కుట్ర జరిగిందని నిందితురాలు అనీషా తండ్రి దామోదర్ గుప్తా ఆరోపించారు.
రిషికేశ్వరి ఆత్మహత్య కేసులో చరణ్, శ్రీనివాస్, అనీషాలు నిందితులుగా ఉన్నారు. వీరి బెయిల్ పైన న్యాయస్థానంలో గురువారం విచారణ జరిగింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి: ఎస్ఎఫ్ఐ
నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలన్నారు.
రిషికేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు నగరంలో కళాశాలల బంద్ నిర్వహించారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి బందుకు మద్దతు తెలిపారు.
రిషికేశ్వరి మృతిలో కొత్త కోణాలు!
సూసైడ్ లేఖను రిషికేశ్వరియే రాసిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రిషికేశ్వరి చనిపోయే ముందు రాసిన లేఖలో తన ఐ మిస్ యూ అంటూ తండ్రిని ఉద్దేశించి పేర్కొంది.
అంతకుముందు జితేందర్ అనే వ్యక్తితో చాలాసేపు చాటింగ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఐ మిస్ యూ జితేందర్ అంటూ రాసిందని, దానికి అతను ఎందుకు అని ప్రశ్నించాడని, తాను చాలా బిజీ అవుతున్నానని, అందుకే ఐ మిస్ యూ అని పేర్కొన్నానని చాటింగ్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
రిషికేశ్వరి మృతికి 48 గంటల ముందు వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. రిషికేశ్వరి మృతి నేపథ్యంలో పోలీసులు లెటర్, డైరీ, ట్యాబ్ను ఎఫ్ఎస్ఎల్ (ఫోరెన్సిక్ ల్యాబ్)కు పంపించారు. రెండు రోజుల్లో నివేదిక ఇస్తామని ఎఫ్ఎస్ఎల్ పోలీసులకు చెప్పింది. కాగా, పోలీసులు సెల్ ఫోన్ డేటా రికవరీ చేశారు.