చంద్రబాబుపై క్రిమినల్ చర్యలకు రోజా డిమాండ్- పవన్ ఊసేదీ.. ! కేసీఆర్ ఎంట్రీపై వార్నింగ్.. !
ఏపీ రాజకీయాల్లో కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలు తీవ్ర రచ్చకు కారణమవుతున్నాయి. వీటిపై ఇప్పటికే టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ యుద్ధం సాగుతుండగా.. ప్రభుత్వం ర్యాలీలు, సభలపై నిషేధం విధిస్తూ ఇవాళ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఈ ఉత్తర్వులు విపక్షాలను కలవరపెడుతున్నాయి. అదే సమయంలో జనం చావులకు కారణమైన చంద్రబాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మంత్రి రోజా ఇవాళ డిమాండ్ చేసారు. అలాగే ఏపీలో కేసీఆర్ ఎంట్రీపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు, లోకేష్ పై రోజా
ఏపీలో తాజాగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలపై మంత్రి ఆర్కే రోజా ఇవాళ స్పందించారు. తిరుమల వచ్చిన ఆమె.. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. కందుకూరులో చంద్రబాబు ఎనిమిది మందిని పొట్టనపెట్టుకున్నాడని, గుంటూరులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయి, 30 మంది క్షతగాత్రులు అయ్యారని రోజా విమర్శించారు. నిత్యావసర సరుకులు పంపిణీ ఎర చూపి ఈ దాష్టికానికి పాల్పడ్డారన్నారు. ఈ ప్రమాదానికి కారకులైన చంద్రబాబు, లోకేష్ లపై క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు.

పవన్ ను కనబడట్లేదా ?
పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు నీచ రాజకీయాలు కంటబడటం లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఇప్పటంలో ఏమి లేనిదానికి హడావిడి చేసిన పవన్.. నేడు మౌనం వహిస్తున్నాడని ఆమె ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ లు అధికారమే పరమావధిగా రాజకీయం చేస్తున్నారన్నారు. వైసీపీ కుట్ర చేస్తుంది అంటున్న లోకేష్ ట్వీట్ అబద్ధమన్నారు.చంద్రబాబును మించిన నీచమైన స్థాయికి లోకేష్ దిగజారిపోయాడన్నారు. రాష్ట్రంలో తాజా తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో బహిరంగ సభలకు ఖాళీప్రదేశాలను మాత్రమే కేటాయించాలి అనే ఆలోచన చేస్తున్నామని మంత్రి రోజా వెల్లడించారు.

కేసీఆర్ పై షాకింగ్ కామెంట్స్
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని పొంది తిరిగి ఏపీలో చొరబడతామేంటే ఊరుకునేది లేదన్నారు. కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసిందని, కేసీఆర్ ఏపీలో కాలుపెడితే ప్రజలే బుద్ది చెబుతారని రోజా హెచ్చరించారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీశారని, కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏపికి అన్యాయం చేసిందన్నారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదును తెలంగాణకు పరిమితం చేశారని రోజా తెలిపారు.
బీఆర్ఎస్ పేరు పెట్టుకొని కేసీఆర్ ఏపీలో కాలుమోపితే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరేవారికి ప్రజలు సరైన సమాధానం ఇస్తారన్నారు.












Click it and Unblock the Notifications