బాబును ఏకిపారేసిన రోజా : "ఆయనకు ట్రీట్మెంట్ చేయించాలి" (ఫోటోలు)
విజయవాడ : చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీకి సీఎం కావడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా. శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడిన రోజా చంద్రబాబు వ్యవహార శైలిని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు.
వీడియో క్లిప్పింగ్స్ చూపిస్తూ..
మీడియా సమావేశం సందర్బంగా.. గతంలో చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్ ను చూపించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా. ఆ వీడియోల్లో "నేను, వెంకయ్యనాయుడు అవకాశం లభిస్తే, అమెరికాలో పుట్టుండే వాళ్లం" అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ చంద్రబాబు ఏపీలో పుట్టినందుకు సిగ్గుపడాలని ఫైర్ అయ్యారు. ఏపీలో పుట్టాల్సిన వాడిని కాదని చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానించడం పట్ల రోజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
అవేవి చంద్రబాబుకు గుర్తు రాలేదు :
అమెరికాలో పుట్టాల్సినవాడినని చంద్రబాబు చెప్పడంపై.. తీవ్ర అసహనం వ్యక్తం చేసిన రోజా.. అలాంటి వ్యాఖ్యలు చేసేటప్పుడు తన తండ్రి కర్జూరపు నాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ, రాజకీయ భిక్ష పెట్టిన కుప్పం, తన ప్రాణాలు కాపాడిన వెంకటేశ్వర స్వామి.. ఇలా ఇవేవీ ఆయనకు గుర్తుకు రాలేదని, కేవలం వెంకయ్యనాయుడు మాత్రమే చంద్రబాబుకు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు.
బాబు-వెంకయ్య లోపాయకారీ ఒప్పందాలు:
చంద్రబాబు, వెంకయ్యలు అవిభక్త కవలల వంటి వారని ఎద్దేవా చేసిన రోజా.. ఈ ఇద్దరి మధ్య ఎన్నో లోపాయకారీ ఒప్పందాలు దాగున్నాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని నాశనం చేయడంలో ఒకరికొకరు తోడుగా నిలుస్తూ వస్తున్నారని విమర్శించారు. అమెరికాలో పుట్టినా ఇద్దరు కలిసే పుట్టాలనుకుంటున్నారంటే.. ప్రజలు ఈ వ్యాఖ్యలను కాస్త లోతుగా ఆలోచించాలని చెప్పారు రోజా.
రెండకరాల విషయం మరిచిపోయావా బాబు?
మురికి వాడల్లో ఉంటే మురికి ఆలోచనలే వస్తాయన్న చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు రోజా. చంద్రబాబు కూడా కోటీశ్వరుల కుటుంబం నుంచి రాలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని, ఆ విషయాన్ని మరిచిపోయి మురికివాడల్లో నివసించే ప్రజలను తన వ్యాఖ్యలతో అవమానించారని మండిపడ్డారు. చంద్రబాబుకు అంత అహంకారం ఎందుకని ఈ సందర్బంగా రోజా ప్రశ్నించారు.
చంద్రబాబుకు ట్రీట్ మెంట్ చేయించాలి:
మురికి వాడల ప్రజలను అవమానించేలా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే చంద్రబాబు మానసిక పరిస్థితిపై అనుమానాలు వస్తున్నాయన్నారు రోజా. చంద్రబాబుకు ట్రీట్ మెంట్ చేయించాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఇంజినీర్లు ఎన్నో గొప్ప గొప్ప కట్టడాలను నిర్మిస్తుంటే.. చంద్రబాబు మాత్రం సింగపూర్ కంపెనీల వెనుక పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోసపూరిత మాటలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. ఇక ప్రపంచ దేశాలన్ని రష్యాతో ఒప్పందాలు వద్దనుకుంటున్న సమయంలో.. చంద్రబాబు మాత్రం రష్యాతోనే ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని రోజా అన్నారు.స్వదేశీ ఇంజనీర్లను కాదనుకుని సింగపూర్ కంపెనీలకు రాజధాని నిర్మాణ బాధ్యతలు అప్పగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు రోజా.
ఎకనమిక్స్ లో పీహెచ్.డీ చేశారా?
ఎకనమిక్స్ లో పీహచ్.డీ చేశానని చంద్రబాబు చెప్పుకు తిరుగుతున్నారని, కేవలం పీహెచ్.డీకి అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన్నే పీహెచ్.డీ పట్టా వచ్చేయదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని సూచించారు రోజా. భారతీయులను అవమానించడంలో చంద్రబాబు ఎప్పుడు ముందుంటారని ఏపీ వారు గాడిదలు, సింగపూర్ వారు గుర్రాలు అనే ఫీలింగ్ లో చంద్రబాబు ఉంటారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు క్షమాపణలు అడగాల్సిందే :
ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తోన్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రారని చెప్పిన రోజా.. భారతదేశాన్ని అవమానిస్తున్నందుకు గాను భరత మాత కాళ్లు పట్టుకొని చంద్రబాబు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణలకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపేంచేంతా ధైర్యం చంద్రబాబుకు ఉందా? అంటూ నిలదీశారు.
చంద్రబాబు వద్ద ఉన్నది నల్లధనమా? తెల్లధనమా? అన్న విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బ్లాక్ మనీకి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు.. నల్లధనం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
పిల్లిగడ్డం ఉంటే గొప్పోళ్లయిపోరు :
పిల్లి గడ్డం, పిచ్చి గడ్డం ఉంటే చాలు, వారు గొప్పోళ్లనే భావనలో సీఎం చంద్రబాబు ఉన్నారని ఎద్దేవా చేశారు రోజా. మహిళలంటే చంద్రబాబుకు చులకనగా మారిపోయిందని, సంక్షేమం పేరిట అబద్దాలాడుతూ వారిని మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రానికి, వివరాలు వెల్లడించిన వారికే తెలిసే నల్లధనం లెక్కల గురించి చంద్రబాబుకు ఎలా తెలిసిందంటూ ప్రశ్నించిన రోజా.. చంద్రబాబు ఆ విషయం చెప్పారంటే, అది బాబు డబ్బయినా ఉండాలి. లేకపోతే ఆయన బినామీ డబ్బయినా అయి ఉండాలని కామెంట్ చేశారు. అవినీతిలొ కూరుకుపోయిన చంద్రబాబు నల్లధనంపై వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.