భక్తులపైకి దూసుకెళ్లిన లారీ: నలుగురు మృతి, మరో ఐదుగురికి తీవ్రగాయాలు
అనంతపురం: జిల్లాలోని కదిరి మండలం కాలసముద్రం గ్రామ సమీపంలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.
జాతీయ రహదారి పక్కనున్న మారెమ్మ ఆలయం వద్ద భక్తులు 41రోజులుగా పూజలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆలయ ప్రాంగణంలో సోమవారం వంట వండుతుండగా రహదారిపై వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి భక్తులపైకి దూసుకొచ్చింది.
ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కారు ఢీకొని బాలిక మృతి
కడప: జిల్లాలోని కమలాపురం సమీపంలో కారు ఢీకొని ఓ బాలిక మృతి చెందింది. కర్నూలు జిల్లా అస్పిరి మండలం కారుమంచి గ్రామానికి చెందిన మంగమ్మ, కారుమంచిలు కూలీ పని కోసం కడప జిల్లా కమలాపురం మండలానికి వలస వచ్చారు. వీరి కుమార్తె తేజావతి(8) సోమవారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగింది. బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. కూతురు మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications