ఏపీలో ధరల మంట..! జాతీయ సగటును దాటిపోయి-వరుసగా ఐదో నెల..!
ఆంధ్రప్రదేశ్ లో ధరల మంట కొనసాగుతోంది. వరుసగా ఐదో నెలలోనూ రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) జాతీయ సగటును మించిపోయింది. మే నెల నాటికి దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం 3.9 శాతంగా ఉంటే, ఏపీలో అది ఏకంగా 4.9 శాతానికి చేరింది. ఈ పెరుగుదల సామాన్య, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని వెనుక ఉన్న కారణాల్ని ఓసారి చూద్దాం..
ఏపీలో తీవ్ర స్థాయికి ధరల మంట ( retail inflation)
గత అక్టోబర్ 2025లో కేవలం 0.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు, కేవలం 7 నెలల వ్యవధిలోనే 4.9 శాతానికి చేరిపోయింది. శరవేగంగా పెరిగిన ధరలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ముఖ్యంగా పల్లెల్లో ద్రవ్యోల్బణం రేటు 5.09 శాతానికి చేరగా, నగరాల్లో ఇది 4.61 శాతంగా నమోదైంది. నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా నిలుస్తోంది.

గ్రామాల్లో నిత్యావసరాల దడ.. నగరాల్లో విద్యా భారం
తాజా నివేదికల ప్రకారం పల్లెల్లో ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం 6.91 శాతానికి పెరిగింది. పట్టణాల్లో ఇది 5.44 శాతంగా ఉంది. నిత్యావసరుల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పల్లెవాసుల చేతిలో డబ్బు నిలవడం లేదు. ఇదే సమయంలో నగరాల్లోని కుటుంబాలకు చదువుల ఖర్చు కూడా తడిసి మోపెడవుతోంది. విద్యా రంగంలో ద్రవ్యోల్బణం 7.36 శాతంగా నమోదు కావడంతో స్కూలు ఫీజులు, పుస్తకాల ధరలు పెరిగి తల్లిదండ్రులకు పెను భారంగా మారాయి.

హోటల్ నుంచి సెలూన్ వరకూ..
స్థానిక హోటళ్లు, రెస్టారెంట్ల ధరలు కూడా సాధారణ ప్రజలకు ప్రియంగా మారాయి. అన్నింటికంటే ఎక్కువగా పర్సనల్ కేర్, ఇతర రోజువారీ సేవల విభాగంలో ధరలు ఊహించని రీతిలో ఆకాశాన్నంటాయి. ఈ విభాగంలో ఏకంగా గ్రామీణ ప్రాంతాల్లో 24.79 శాతం, పట్టణ ప్రాంతాల్లో 25.71 శాతం అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైంది. నిత్యం వాడే సబ్బులు, టూత్పేస్ట్ల వంటి నిత్యావసరాల ధరలు పెరగడంతో పాటు సెలూన్ ఖర్చులు, టైలరింగ్ ఛార్జీలు సైతం బాగా పెరిగాయి. దీనివల్ల నిరుడు రూ. 10 వేల బడ్జెట్ ఉన్న ప్రతి సామాన్య కుటుంబం, ఇప్పుడు అదనంగా మరో రూ.500 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ద్రవ్యోల్బణ పరిస్థితిని 'ప్రత్యేక శ్రద్ధ' అవసరమైన జాబితాలో చేర్చింది.












Click it and Unblock the Notifications