RBI సర్వే సంచలన హెచ్చరిక! చుక్కలు చూపిస్తున్న ద్రవ్యోల్బణం..
దేశంలో ఆర్థిక వృద్ధి రేటు (GDP) పరుగులు పెడుతోందని గణాంకాలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. దేశంలోని పట్టణ ప్రాంతాల ప్రజలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు, ఆదాయ వృద్ధి , ఖర్చుల విషయంలో తీవ్ర అసంతృప్తితో, ఆందోళనతో ఉన్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా సర్వేలో తేలింది. మార్చి నెలతో పోలిస్తే మే నెలలో ప్రజల్లో భవిష్యత్తుపై ఉన్న నమ్మకం, విశ్వాసం బాగా సన్నగిల్లినట్లు ఆర్బీఐ తన 'కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే'లో సంచలన నిజాలను వెల్లడించింది.
పడిపోయిన వినియోగదారుల విశ్వాసం (Consumer Confidence)
దేశంలోని 19 ప్రధాన నగరాల్లోని 6,086 మంది అభిప్రాయాల ఆధారంగా ఆర్బీఐ ఈ సర్వేను మే 2 నుంచి 11 మధ్య నిర్వహించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులపై ప్రజల మూడ్ను అంచనా వేసే 'కరెంట్ సిట్యుయేషన్ ఇండెక్స్' (CSI) మార్చిలో 95.7 పాయింట్లు ఉంటే.. మే నాటికి అది 90.7 పాయింట్లకు పడిపోయింది. అలాగే వచ్చే ఏడాది కాలంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందనే ఆశాభావాన్ని సూచించే 'ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్' (FEI) కూడా 120.2 నుంచి 118.7 పాయింట్లకు క్షీణించింది. సెప్టెంబర్ 2023 తర్వాత ఈ సూచీ ఇంత కనిష్ట స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చుక్కలు చూపిస్తున్న ద్రవ్యోల్బణం.. ఉద్యోగాలపై నమ్మకం గల్లంతు!
ఈ సర్వేలో పాల్గొన్న వారిలో ఏకంగా 91.6 శాతం మంది గడిచిన ఏడాది కాలంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని వాపోయారు. జీవన వ్యయం (Cost of Living) మునుపటి కంటే వేగంగా పెరుగుతోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. దీనికి తోడు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మరింత బలహీనపడ్డాయని సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుత ఉపాధి పరిస్థితులపై అసంతృప్తి వ్యక్తం చేసిన వారి సంఖ్య మార్చితో పోలిస్తే (-9.1 నుంచి -14.4 కి) గణనీయంగా పెరిగింది. రాబోయే రోజుల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కూడా తగ్గిపోతోందని పట్టణ భారతీయులు పేర్కొన్నారు.
చేతిలో డబ్బులు ఆడట్లేదు.. విలాసాలకు బ్రేక్!
ధరల పెరుగుదల ఒకవైపు.. ఆశించిన స్థాయిలో ఆదాయాలు పెరగకపోవడం మరోవైపు ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. ప్రస్తుతం తమ ఆదాయ వృద్ధి రేటు మందగించిందని సర్వేలో తేలింది. ఈ ప్రభావం నేరుగా ప్రజల కొనుగోలు శక్తి (Spending)పై పడింది. కుటుంబాలు తమ రోజువారీ అత్యవసరాలైన కూరగాయలు, కిరాణా, పాలు వంటి వాటిపై ఖర్చులను యథాతథంగా కొనసాగిస్తున్నప్పటికీ.. వినోదం, గ్యాడ్జెట్లు (మొబైల్స్, లాప్టాప్స్), బట్టలు , ఇతర విలాసవంతమైన వస్తువుల కొనుగోళ్లను పూర్తిగా తగ్గించుకుంటున్నారు. గడిచిన కొన్ని నెలల్లో నాన్-ఎసెన్షియల్ (అత్యవసరం కాని) ఖర్చులపై సెంటిమెంట్ మొదటిసారిగా నెగటివ్లోకి (-0.8) పడిపోవడం ప్రజల ఆర్థిక ఇబ్బందులకు అద్దం పడుతోంది.
ఆర్థిక నిపుణుల హెచ్చరిక.. వృద్ధి రేటు అంచనాలు డౌన్!
ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్యే ఆర్బీఐ నిర్వహించిన 100వ 'సర్వే ఆఫ్ ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్' (ఆర్థిక నిపుణుల అంచనాలు) కూడా దేశ ఆర్థిక వృద్ధిపై కొంత నిరాశను వ్యక్తం చేసింది. దేశ వాస్తవ జీడీపీ (GDP) వృద్ధి రేటు అంచనాను గతంలో అనుకున్న 6.9 శాతం నుంచి 6.5 శాతానికి ఆర్థిక నిపుణులు తగ్గించారు. పెరుగుతున్న ధరలు, మందగించిన ఉపాధి అవకాశాలు, తగ్గుతున్న ఆదాయాలు కలిసి దేశ ఆర్థిక ప్రగతి వేగాన్ని తగ్గించవచ్చని వారు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి రాబోయే రోజుల్లో సాధారణ పౌరుడు మరింత ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.














Click it and Unblock the Notifications