CJP account block: మమ్మల్ని టెర్రరిస్టులు అనడానికి సిగ్గుగా లేదా..?
దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సిజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే చేపట్టిన నిరసన దీక్ష బుధవారంతో ఐదో రోజుకు చేరుకుంది. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో జరుగుతున్న తీవ్ర అవకతవకలు, నీట్ (NEET) పేపర్ లీకేజీ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఆయన ఈ ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న ప్రక్రియపై ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
తమ సంఘానికి చెందిన సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) సమీక్షా కమిటీ ముందు అభిజిత్ హాజరయ్యారు. అయితే, ఖాతాలను ఎందుకు బ్లాక్ చేశారో వివరించడానికి అధికారులు నిరాకరించారని, ఆ వివరాలను గోప్యంగా ఉంచుతున్నామని చెప్పారని ఆయన వెల్లడించారు. అంతా రహస్యంగా ఉంచాలనుకున్నప్పుడు నీట్ పరీక్ష పేపర్ ను ఎందుకు రహస్యంగా ఉంచలేకపోయారని, అది లీక్ కావడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన
సీజేపీని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 'ఉగ్రవాదుల బీ-టీమ్' అని అభివర్ణించడాన్ని అభిజిత్ తీవ్రంగా తప్పుపట్టారు. తాము ఓట్ల కోసం కాకుండా విద్యార్థుల న్యాయం కోసం పోరాడుతున్నామని స్పష్టం చేశారు. తాము, తమ తల్లిదండ్రులు పన్నులు కడుతున్నామని, అలాంటి దేశ పౌరులను ఉగ్రవాదులుగా పిలవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో తమ హక్కుల కోసం పోరాడిన రైతులను, వైద్యులను కూడా పాలకులు ఇలాగే దేశద్రోహులుగా, ఉగ్రవాదులుగా ముద్ర వేశారని గుర్తు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపగలిగానని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశంలో పేపర్ లీకేజీలను ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని అభిజిత్ ఎద్దేవా చేశారు. పరీక్షల వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, అప్పుడే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని స్పష్టం చేశారు. అప్పటివరకు తాము జంతర్ మంతర్ నిరసన స్థలం నుండి కదిలే ప్రసక్తి లేదని ఆయన తేల్చి చెప్పారు.

నిరుద్యోగ యువతను బొద్దింకలతో పోల్చారనే వివాదం నేపథ్యంలో ఈ ఏడాది మే 16న ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భవించింది. మే 21న వీరి పాత సోషల్ మీడియా ఖాతాను నిలిపివేయగా, ప్రస్తుతం సరికొత్త ఖాతాతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా కేవలం బాధిత విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications