రోడ్డు ప్రమాదాలకు చెక్: ఇకపై వాహనాలే మాట్లాడుకుంటాయి!
ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు, రహదారి భద్రతను పటిష్టం చేసేందుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ విప్లవాత్మక అడుగు వేసింది. వాహనాల మధ్య ప్రత్యక్ష సమాచార మార్పిడికి వీలు కల్పించే వెహికల్-టు-వెహికల్(V2V) కమ్యూనికేషన్ వ్యవస్థను ఇండియాలో దశలవారీగా అమలు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ టెక్నాలజీ ద్వారా కార్లు, ఇతర వెహికల్స్ ప్రయాణ సమయంలో ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటూ ప్రమాదాలకు గురికాకుండా డ్రైవర్లను ముందే హెచ్చరిస్తాయి.
వీ2వీ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే?
ఈ వీ2వీ కమ్యూనికేషన్ సిస్టమ్ సమీపంలో ప్రయాణించే వాహనాల మధ్య రియల్ టైమ్ డేటాను పంచుకుంటుంది. వాహన వేగం, ఖచ్చితమైన స్థానం, ప్రయాణించే దిశ, యాక్సిలరేషన్, బ్రేకింగ్ వంటి వివరాలు ఇతర వాహనాలకు అందుతుంటాయి. ఉదాహరణకు ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసినా, లైన్ మారినా లేదా బ్లైండ్ స్పాట్స్ లో ఇతర వెహికల్ ఉన్నా వెనుక వచ్చే డ్రైవర్లకు వెంటనే అలర్ట్ మెసేజ్ వెశళ్తుంది. అంతే కాకుండా అంబులెన్స్, ఫైరింజిన్ వంటి అత్యవసర వాహనాలు దగ్గరకు వస్తున్నప్పుడు కూడా ఈ వ్యవస్థ ముందస్తు హెచ్చరికలను అందిస్తుంది.

ఉచిత ఫ్రీక్వెన్సీ బ్యాండ్
మోటారు వాహనాల మధ్య (వీ2వీ) సమాచార వ్యవస్థలను దశల వారీగా అమలు చేయడానికి కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కి సవరణలు ప్రతిపాదిస్తూ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఓ ముసాయిదా ప్రకటనను విడుదల చేసింది.వాహనాల మధ్య ఈ అధునాతన V2V మరియు ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ ( వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం 5.875 గిగాహెర్ట్జ్ నుంచి 5.925 గిగాహెర్ట్జ్ బ్యాండ్ విడ్త్ ఫ్రీక్వెన్సీని ప్రతిపాదించింది. టెలికమ్యూనికేషన్ల విభాగం 10 జూన్ 2026 నాటి జీ.ఎస్.ఆర్ 466(ఈ) ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ పరిధి వినియోగానికి సంబంధించిన లైసెన్సింగ్ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. దీని వల్ల వాహన తయారీ సంస్థలు ఎలాంటి చట్టపరమైన అడ్డంకులు లేకుండా ఈ ఫీచర్ ను కార్లలో సులభంగా అమర్చవచ్చు.
కేవలం వాహనంలో ఉండే సెన్సార్లు, డ్రైవర్ తక్షణ స్పందనపై మాత్రమే ఆధారపడే సాధారణ భద్రతా వ్యవస్థలతో పోలిస్తే వీ2వీ సాంకేతికత చాలా భిన్నమైనది. డ్రైవర్ కంటికి నేరుగా కనిపించని ప్రమాదకర పరిస్థితుల సమాచారాన్ని కూడా ఇది ముందే పసిగట్టి అందించగలదు. అందువల్ల ఇది అధునాతన డ్రైవర్ సహాయక వ్యవస్థ (ఏడీఏఎస్) సాంకేతికతకు మరింత తోడ్పడుతూ.. ప్రమాదాలను ముందస్తుగా నివారించడానికి, వాహనాల అనుసంధానానికి, భవిష్యతత్తు స్మార్ట్ రవాణా వ్యవస్థల వినియోగానికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ముసాయిదా నోటిఫికేషన్ ప్రకారం కింద పేర్కొన్న కాలపరిమితిని ప్రతిపాదించారు.
*1 అక్టోబర్ 2027 నాటికి లేదా ఆ తర్వాత తయారై, వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కలిగిన ఎల్, ఎం, ఎన్ కేటగిరీ వాహనాలు తప్పనిసరిగా ఏఐఎస్-230 నిబంధనలకు అనుగుణంగా ఉండాలి.
*1 అక్టోబర్ 2028న లేదా ఆ తర్వాత 1 తయారయ్యే ఎల్, ఎం, ఎన్ కేటగిరీ వాహనాలన్నింటికీ ఏఐఎస్-230 నిబంధనలకు అనుగుణంగా వీ2వీ కమ్యూనికేషన్ వ్యవస్థలను తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది.
ఈ దశలవారీ విధానం వాహన తయారీదారులకు, ఇతర భాగస్వాములకు కొత్త నిబంధనల అమలుకు సిద్ధం కావడానికి తగినంత సమయాన్ని అందిస్తుంది. భారతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలలో అమర్చే వీ2వీ సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి కనీస సాంకేతిక, కార్యాచరణ, పనితీరు, పర్యావరణ, భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ ఏఐఎస్-230 ను రూపొందించారు.ఈ నిబంధనలు 5.875 జీహెచ్జెడ్ నుంచి 5.925 జీహెచ్జెడ్ ఫ్రీక్వెన్సీ పరిధిలో సెల్యులార్ వెహికల్-టు-ఎవ్రీథింగ్ (సీ-వీ2ఎక్స్) సాంకేతికతను ఉపయోగించి, వాహనాల తయారీ సమయంలోనే కంపెనీలు అమర్చే ఆన్-బోర్డ్ యూనిట్లకు ఇవి వర్తిస్తాయి.
దశలవారీగా అందుబాటులోకి వచ్చే భద్రతా ఫీచర్లు
వీ2వీ టెక్నాలజీ అమల్లోకి వచ్చిన అనంతరం వాహనాల్లో ప్రధానంగా ఈ 4 రకాల కీలక ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు పనిచేస్తాయి.
అత్యవసర బ్రేక్ హెచ్చరిక: ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా లేగా వేగంగా బ్రేక్ వేసినప్పుడు వెనుక వస్తున్న వాహనాల డ్రైవర్లకు తక్షణమే డిజిటల్ అలర్ట్ వెళ్తుంది. దీని వల్ల వెనుక వాహనం సమయానికి బ్రేక్ వేసిన ప్రమాదాన్ని నివారించవచ్చు.
ముందున్న వాహనాన్ని ఢీకొట్టే ప్రమాదాన్ని తెలిపే హెచ్చరిక: ప్రయాణ దిశలో ముందున్న వాహనానికి మీ వాహనం వేగంగా సమీపిస్తున్నప్పుడు, వేగం తేడాను బట్టి ప్రాణాంతక ఢీకొనే ప్రమాదాన్ని ముందే హెచ్చరిస్తుంది.
తప్పు దారిలో వాహనాలు వెళ్తుంటే తెలిపే హెచ్చరిక: ప్రయాణ మార్గంలో లేదా వన్-వే రోడ్లలో ఎవరైనా వాహనాన్ని తప్పు దిశలో నడుపుతూ వస్తుంటే, ఆ ప్రమాదాన్ని గుర్తించి సమీపంలో ఉన్న ఇతర వాహనదారులకు ముందస్తు అలర్ట్ పంపుతుంది.
అత్యవసర వాహనాల హెచ్చరిక: అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ లేదా పోలీస్ వాహనాలు సమీపంలోకి వస్తున్నప్పుడు ఇతర వాహనదారులకు ముందే సమాచారం అందిస్తుంది. దీనివల్ల అత్యవసర వాహనాలకు దారి ఇవ్వడం సులువవుతుంది.
దేశంలో వీ2వీ సాంకేతిక వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ (ఐటీఎస్) అభివృద్ధి, అమలు కోసం మంత్రిత్వ శాఖ ఒక టాస్క్ ఫోర్సును ఏర్పాటు చేసింది. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి 5.9 జీహెచ్జెడ్ ఐటీఎస్/వీ2ఎస్ ఫ్రీక్వెన్సీ పరిధిని ఉపయోగించాలని ఆ టాస్క్ ఫోర్స్ సిఫార్సు చేసింది. 7 మే 2026న జరిగిన 56వ సమావేశంలో కేంద్ర మోటారు వాహనాల నిబంధనల సాంకేతిక స్థాయి కమిటీ కూడా ఏఐఎస్-230 రూపకల్పనను పరిశీలించింది. భారత్లో వీ2వీ సాంకేతిక వ్యవస్థల చట్టబద్ధమైన అమలుకు ఈ ప్రామాణికత సాంకేతిక బలాన్ని అందిస్తుంది. ప్రతిపాదిత ఈ వ్యవస్థ వాహనాల చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహనను పెంచుతుందని, సమయానికి భద్రతా హెచ్చరికలను అందిస్తుందని భావిస్తున్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల ముప్పును తగ్గించడానికి అనుసంధానిత సాంకేతికతల వినియోగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా. ముసాయిదా నిబంధనలపై వచ్చే సూచనలు, అభిప్రాయాలను 30 రోజుల గడువు ముగిసిన తర్వాత పరిశీలిస్తారు. ఆ తర్వాతే తుది నోటిఫికేషన్ను విడుదల చేస్తారు.




Click it and Unblock the Notifications