బిగ్గెస్ట్ టోర్నీకి ముందు.. తిరుమలలో రోహిత్ శర్మ- శ్రీవారి సెంటిమెంట్
తిరుపతి: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. ఆ దేశ జట్టుతో టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ ఆడుతోంది. అయిదు మ్యాచ్ల సిరీస్ ఇది. తలా ఓ రెండు మ్యాచ్లను గెలిచిన ఈ రెండు జట్లూ.. సమవుజ్జీగా నిలిచాయి. తొలి రెండు మ్యాచ్లను విండీస్ వీరులు సొంతం చేసుకోగా.. మలి రెండింట్లోనూ భారత్ జట్టు జయ కేతనాన్ని ఎగురవేసింది. ఈ రాత్రి సిరీస్ డిసైడర్ షెడ్యూల్ అయింది.
టీమిండియా రెగ్యులర్ కేప్టెన్ రోహిత్ శర్మ.. ఈ సిరీస్ ఆడట్లేదు. అలాగే- బ్యాటింగ్ మెషీన్ విరాట్ కోహ్లీ కూడా దూరంగా ఉంటోన్నాడు. వెస్టిండీస్ సిరీస్ తరువాత జరగబోయే ఆసియా కప్ 2023 కోసం సీనియర్లు విశ్రాంతి తీసుకుంటోన్నారు. రోహిత్ శర్మ గైర్హాజరీలో విండీస్తో సిరీస్ ఆడుతోన్న జట్టుకు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వాన్ని వహిస్తోన్నాడు.

ఈ నెల 30వ తేదీన ఆసియా కప్ ఆరంభం కాబోతోంది. పాకిస్తాన్, శ్రీలంక ఉమ్మడిగా ఈ సిరీస్కు ఆతిథ్యాన్ని ఇస్తోన్నాయి. తొలి మ్యాచ్లో పాకిస్తాన్, నేపాల్ ఢీ కొనబోతోన్నాయి. సెప్టెంబర్ 2వ తేదీన భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఎదుర్కొనాల్సి ఉంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం దీనికి వేదిక. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది.
ఇది భారత్కు ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్. అత్యధికంగా ఏడుసార్లు ఈ టోర్నమెంట్ను సొంతం చేసుకుంది. ఆరుసార్లు శ్రీలంక.. టైటిల్ను ఎగురేసుకెళ్లింది. పాకిస్తాన్ రెండుసార్లు మాత్రమే ఈ కప్ను కైవసం చేసుకోగలిగింది. ఇక ఈ సారి ఈ ఆసియా కప్లో ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

ఈ పరిణామాల మధ్య- భారత జట్టు కేప్టెన్ రోహిత్ శర్మ.. తిరుమలకు వచ్చారు. భార్య రితిక సజ్దే, సమైరా శర్మతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక సేవల్లో పాల్గొన్నారు. ఆసియా కప్ టోర్నమెంట్ ఆరంభం కాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సెంటిమెంట్ ప్రకారం.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలకు వచ్చిన రోహిత్ శర్మ, ఆయన కుటుంబ సభ్యులను టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శనానంతరం ఆలయం ప్రాంగణంలోని రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శేష వస్త్రాన్ని కప్పి గౌరవించారు. టీటీడీ అర్చకులు వేదాశీర్వాదాలను పలికారు.












Click it and Unblock the Notifications